ఒమిక్రాన్ టెర్రర్: ఎన్నికలు వాయిదా.. ర్యాలీలు నిషేధం, ఈసీ, ప్రధానికి కోర్టు రిక్వెస్ట్
ఒమిక్రాన్ టెన్షన్ పెడుతుంది. వేగంగా వ్యాపించడంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తోంది. ఇప్పటికే ప్రధాని మోడీ రివ్యూ చేశారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం రాత్రి పూట కర్ఫ్యూ స్టార్ట్ చేసింది. ఈ క్రమంలో అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వచ్చే ఏడాది జరిగే ఉత్తరప్రదేశ్ ఎన్నికలపై కామెంట్ చేసింది. ఒమిక్రాన్ వేరియంట్ దృష్ట్యా.. ఎన్నికలను వాయిదా వేయాలని కోరింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. ఈసీ సహా ప్రధాని మోడీని కూడా రిక్వెస్ట్ చేసింది. ఎన్నికలను వాయిదా వేయాలని కోరింది.
ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే తీవ్రత ఎక్కువగానే ఉండేట్టు ఉంది. సెకండ్ వేవ్ను మించి ఉంటుందని జస్టిస్ శేఖర్ యాదవ్ కామెంట్ చేశారు. అందుకోసమే ర్యాలీలు నిలిపివేయాలని కోరారు. లేదంటే వేగంగా వైరస్ వ్యాప్తి చెందుతుందని వివరించారు. దేశంలో ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు 300 దాటిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆందోళన నెలకొంటుంది.యూపీ సహా 5 రాష్ట్రాల ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అలహాబాద్ కోర్టు మంచి సూచన చేసింది. దేశంలో ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వడం అనేది మంచి కార్యక్రమం అని హైకోర్టు ప్రశంసించింది.
అంతకుముందు రాష్ట్రంలో కొవిడ్ ప్రభావంపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఒమిక్రాన్ వైరస్ తీవ్రత నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎయిర్ పోర్టులో ఉన్న విధంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారికి తగిన వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాటు చేయాలని సూచించింది. మహారాష్ట్ర, ఢిల్లీ ప్రభుత్వాలు ఏ విధంగా నిబంధనలు విధించారో అదేవిధంగా ఆదేశాలు జారీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. రెండు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
ఇటు మధ్యప్రదేశ్ వేగంగా స్పందించింది. ఇవాళ రాత్రి నుంచి రాత్రి కర్ఫ్యూ స్టార్ట్ చేసింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ష్యూ అమల్లో ఉంటుంది. తదుపరి ఆదేశాలు అమలు చేసే వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. ఈ క్రమంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం వెంటనే స్పందించింది.