పాత కేసులు తవ్వి తీస్తోన్నారు: అధికార పార్టీ ఎమ్మెల్యే అరెస్ట్..: మున్ముందు మరిన్ని
న్యూఢిల్లీ: ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వరుస దాడులతో సతమతమౌతోంది. లిక్కర్ స్కాం ఆరోపణలను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్ అయ్యారు. మనీ లాండరింగ్ కేసులో ఆయనను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను టార్గెట్ చేశారు సీబీఐ-ఈడీ అధికారులు. ఆయన ఇంట్లో, కార్యాలయాల్లో సోదాలను నిర్వహించారు. అదుపులోకి తీసుకుని విచారించారు.
అదే సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీకే చెందిన శాసన సభ్యుడు అమనతుల్లాఖాన్ అరెస్ట్ అయ్యారు. ఢిల్లీ అవినీతి నిరోధక విభాగం అధికారులు ఆయనను అరెస్ట్ చేశారు. రెండు సంవత్సరాల కిందటి పాత కేసును అధికారులు తవ్వి తీశారు. వక్ఫ్బోర్డ్ నియామకాల్లో అవకతవకలకు పాల్పడినట్లు ఫిర్యాదులు అందడంతో ఏసీబీ అధికారులు ప్రీవెన్షన్ ఆఫ్ కరప్షన్ 2020 యాక్ట్ కింద అరెస్ట్ చేశారు.
ఛార్జ్షీట్ నమోదు చేశారు. ఢిల్లీ ఓఖ్లా నియోజకవర్గానికి అమనతుల్లా ఖాన్ ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నారు. వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్గా పనిచేశారు. తన హయాంలో 32 మందిని నిబంధనలకు విరుద్ధంగా వక్ఫ్బోర్డులో అపాయింట్ చేశారని, పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్లు ఆయనపై ఫిర్యాదులు అందాయి. నియామకాల్లో తన బంధువులకు ప్రాధాన్యత ఇచ్చారనే విషయం తమ దర్యాప్తులో తేలిందని ఏసీబీ అధికారులు తెలిపారు. సోదాల సందర్భంగా 24 లక్షల రూపాయల నగదు, రెండు లైసెన్స్ రహిత ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
అమనతుల్లా ఖాన్ నివాసంలో తనిఖీలో కొనసాగే సమయంలో ఆయన బంధువులు ఏసీబీ సిబ్బందిపై దాడికి దిగారనే విమర్శలు ఉన్నాయి. తనపై వచ్చిన ఆరోపణలను ఎమ్మెల్యే తోసి పుచ్చారు. తనను ఫ్రేమ్ చేస్తోన్నారని ఆరోపించారు. వక్ఫ్ బోర్డ్ ఆస్తులను పరిరక్షించడమే కేంద్ర ప్రభుత్వ పెద్దలకు తాను చేసిన తప్పుగా కనిపిస్తోందని అన్నారు. నిష్పక్షపాతంగా పని చేశానని, ఏసీబీ అధికారుల విచారణను తాను ఎదుర్కొంటానని చెప్పారు.