Delhi Assembly Election 2025: మహిళలకు నెలకు రూ.2,500.. 300 యూనిట్ల ఉచిత విద్యుత్.. ఢిల్లీలో కాంగ్రెస్ వరాలు
Delhi Assembly Election 2025: ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ బుధవారం తన మేనిఫెస్టోను విడుదల చేసింది. ఢిల్లీ ప్రజలపై హస్తం పార్టీ హామీల వర్షం కురిపించింది. ఉద్యోగాలు, విద్యలో ట్రాన్స్ జెండర్లకు రిజర్వేషన్లు, 300 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు నెలకు రూ,2,500 ఇస్తామంటూ కాంగ్రెస్ అనేక హామీలను ప్రకటించింది.
ఢిల్లీ ప్రజలకు రూ. 25 లక్షల వరకు ఉచిత ఆరోగ్య చికిత్సను అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. యువ ఓటర్లను ఆకర్షించేలా ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో ఒక సంవత్సరం అప్రెంటిస్షిప్ ఇస్తామని కాంగ్రెస్ ప్రతిజ్ఞ చేసింది. అప్రెంటిస్షిప్ సమయంలో యువతకు నెలకు రూ. 8.500 స్టైఫండ్ లభిస్తుంది. రూ.500కే సబ్సిడీలో ఎల్పీజీ సిలిండర్లను అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది.

అంతేకాకుండా, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఢిల్లీలోని కుటుంబాలకు 2 కిలోల చక్కెర, 1 కిలో వంట నూనె, 6 కిలోల పప్పులు, 250 గ్రాముల టీ పౌడర్ సహా ఉచిత రేషన్ కిట్ కూడా అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది.
ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 5న ఒకే దశలో పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ఫలితాలు ఫిబ్రవరి 8న విడుదల కానున్నాయి. మరోవైపు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఐదో జాబితాను కాంగ్రెస్ ప్రకటించింది. ఈ చివరి జాబితాలో కాంగ్రెస్ ఇద్దరిని ప్రకటించింది. దీంతో 70 స్థానాలకు కాంగ్రెస్ మొత్తం అభ్యర్థులను ప్రకటించింది.












Click it and Unblock the Notifications