షాకింగ్ : ఢిల్లీలో బీజేపీ సీనియర్ నేత ఆత్మహత్య... పార్క్లో ఉరేసుకుని...
ఢిల్లీలో బీజేపీకి చెందిన సీనియర్ నేత ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. గతంలో బీజేపీ పశ్చిమ ఢిల్లీ ఉపాధ్యక్షుడిగా పనిచేసిన జీఎస్ బవా.. స్థానికంగా ఉన్న ఓ పార్కులో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ సభ్యులతో గొడవలే ఆయన ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది. అయితే బవా ఆత్మహత్యపై అధికారిక వివరాలేవీ వెల్లడి కాలేదు. ఇటీవల బీజేపీ ఎంపీ రామ్ స్వరూప్ శర్మ ఢిల్లీలో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మరవకముందే మరో బీజేపీ నేత ఇలా ఆత్మహత్యకు పాల్పడటం గమనార్హం.
జీఎస్ బవా పశ్చిమ ఢిల్లీలోని ఫతే నగర్లో నివసిస్తున్నారు. సోమవారం(మార్చి 29) స్థానిక సుభాష్ నగర్లో ఉన్న పార్క్కి బవా వెళ్లారు. ఏమైందో ఏమో తెలియదు గానీ సాయంత్రం 6గంటల సమయంలో ఆయన పార్క్లో ఓ గ్రిల్కి వేలాడుతూ కనిపించారు. దీంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు మృతుడిని జీఎస్ బవాగా గుర్తించారు. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. ఆ తర్వాత మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
హిమాచల్ ప్రదేశ్కి చెందిన బీజేపీ ఎంపీ రామ్ స్వరూప్(62) ఈ నెల 17న ఢిల్లీలో ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. గోమతి అపార్ట్మెంట్లోని తన ఫ్లాట్లో రామ్ స్వరూప్ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేసులో కీలక ఆధారాల కోసం సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో దాద్రానగర్ హవేలీ ఎంపీ మోహన్ దేల్కర్ కూడా ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ముంబైలోని ఓ హోటల్లో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. హోటల్ గదిలో సూసైడ్ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏడుసార్లు లోక్సభకు ప్రాతినిధ్యం వహించిన ఎంపీ ఇలా ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. సిల్వస్సాలో ట్రేడ్ యూనియన్ లీడర్గా కెరీర్ ప్రారంభించిన ఆయన తొలిసారి 1989లో లోక్సభకు ఎన్నికయ్యారు. అప్పటినుంచి 2009 వరకు వరుసగా ఆరుసార్లు ఎంపీగా గెలిచారు. తిరిగి 2019లో స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో గెలిచారు. ఆయనకు భార్య,కుమార్తె,కుమారుడు ఉన్నారు.
కాగా,దేశంలో ఇలా ప్రజాప్రతినిధులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.