కంటోన్మెంట్ ఎన్నికలు: గాల్లోకి డబ్బులు వెదజల్లిన ఆప్ కార్యకర్తలు
న్యూఢిల్లీ: రెండు జాతీయ పార్టీలకు ప్రత్యామ్నాయమని చెప్పుకుంటూ.. అవినీతి రహిత, స్వచ్ఛమైన పాలన అందిస్తామని అంటున్న అరవింద్ కేజ్రివాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ చిక్కుల్లో పడింది. ఢిల్లీలో జరిగిన కంటోన్మెంట్ ఎన్నికల్లో గెలిచిన ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి నంద్ కిషోర్ బెనివాల్ గెలిచారు.
ఈ ఆనందంలో మద్దతుదారులతో కలిసి ఆయన సోమవారం నిర్వహించిన ర్యాలీలు డబ్బులను గాల్లోకి వెదజల్లారు. ఈ తతంగమంతా కెమెరాలకు చిక్కింది. దీంతో ఘటన వివాదంగా మారింది. ప్రజల నుంచి సేకరించిన డబ్బులు ఎక్కడిపోతున్నాయని ఆమ్ ఆద్మీ పార్టీని ఇతర పార్టీలు ప్రశ్నిస్తున్నారు.
అవినీతి రహిత పార్టీగా, కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలకు ప్రత్యామ్నాయం తామేనని చెప్పుకుంటూ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ ఘటన అరవింద్ కేజ్రివాల్కి తలనొప్పిగా మారింది.
కాగా, ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆప్ నేతలంటున్నారు. డబ్బులు విసిరిన కార్యకర్తను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. తాను ఇలాంటి చర్యలను సమర్థించనని నంద్ కిషోర్ బెనివాల్ తెలిపారు.
కాగా, 8 స్థానాలకు జరిగిన ఈ ఎన్నికల్లో బిజెపి 5, ఆప్ 2, కాంగ్రెస్ ఒక స్థానాన్ని గెలుచుకుకున్నాయి. కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో ఆప్ తొలిసారి పోటీ చేసింది.