ఢిల్లీ పేలుడు ఘటనలో కీలక పరిణామం...కారు యజమాని ఎవరంటే..?
దేశ రాజధాని ఢిల్లీ సోమవారం సాయంత్రం కారు బాంబు పేలుడుతో ఉలిక్కిపడింది. చారిత్రక ఎర్రకోట సమీపంలోని రెడ్లైట్ వద్ద ఆగి ఉన్న ఒక కారులో 6:52 గంటల సమయంలో సంభవించిన ఈ భారీ దుర్ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఈ దారుణమైన పేలుడులో 13 మంది అక్కడికక్కడే మరణించగా, 24 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు ప్రకటించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మృతుల సంఖ్యను ధృవీకరించారు. పేలుడు ధాటికి మరో 22 వాహనాలు ధ్వంసమయ్యాయి.
పోలీసులు ఈ కేసు దర్యాప్తులో కీలక పురోగతి సాధించారు. పేలుడుకు ఉపయోగించిన కారు రిజిస్ట్రేషన్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన అధికారులు, ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. పేలుళ్లు జరిగిన కారు హర్యానాకు చెందిన నదీమ్ఖాన్దిగా గుర్తించారు.గతంలో కారు యజమాని అయిన మహ్మద్ సల్మాన్ సైతం గురుగ్రామ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరి విచారణ ద్వారా ఈ కుట్ర వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరనేది తేల్చే పనిలో భద్రతా ఏజెన్సీలు నిమగ్నమై ఉన్నాయి.

ఈ పేలుడు వెనుక ఉగ్రవాద కుట్ర ఉండవచ్చని భద్రతా ఏజెన్సీలు బలంగా అనుమానిస్తున్నాయి. ఇటీవల కాలంలో హర్యానాలో పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు పట్టుబడటం, ఉగ్రవాదుల అరెస్టులు జరగడం ఈ అనుమానాలకు బలం చేకూర్చుతున్నాయి.
దిల్లీ పోలీస్ కమిషనర్ ప్రాథమికంగా ఇది హ్యుందాయ్ ఐ20 కారు అని ప్రకటించారు.అయితే, కొందరు ప్రత్యక్ష సాక్షులు మారుతి స్విఫ్ట్ డిజైర్ కారులో పేలుడు జరిగిందని చెప్పడంతో, వాహనం గుర్తింపుపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.పేలుడు సమయంలో కారులో ముగ్గురు వ్యక్తులు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశామని తెలిపారు. గాయపడిన వారి శరీరాల్లో ఎలాంటి పెల్లెట్లు లభించకపోవడం వంటి అసాధారణ అంశాలను కూడా దర్యాప్తు అధికారులు పరిశీలిస్తున్నారు. దేశ భద్రతకు సవాల్ విసిరిన ఈ పేలుడు ఘటన, ఢిల్లీలో తీవ్ర భయాందోళనలు సృష్టించింది.












Click it and Unblock the Notifications