సుప్రీంకోర్టు కరుణించినా..
Arvind Kejriwal: ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఊరట లభించలేదు. ఈ కేసులో మనీ లాండరింగ్కు పాల్పడినట్లు ఆరోపణలను ఎదుర్కొంటోన్నారు. తీహార్ జైలులో ఉంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సీబీఐ అధికారుల విచారణను ఎదుర్కొంటోన్నారు.
ఈ ఉదయం ఆయనకు ఈడీ కేసులో ఊరట లభించింది. మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. అయినప్పటికీ- కేజ్రీవాల్ ఇప్పట్లో విడుదల అయ్యే అవకాశాలు ఎంతమాత్రమూ లేవు. దీనికి కారణం- మద్యం పాలసీ కుంభకోణం కేసులో సీబీఐ విచారణ ఇంకా కొనసాగుతోండటమే.

సీబీఐ కేసులో నేటితో కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీ గడువు ముగిసింది. దీనితో అధికారులు ఆయనను ఢిల్లీలోని రోస్ అవెన్యూ న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు. సీబీఐ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ తన వాదనలను వినిపించారు. మరి కొంతకాలం పాటు జ్యుడీషియల్ కస్టడీ గడువును పొడిగించాలని న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు.
ఇన్ని రోజుల పాటు నిర్వహించిన విచారణ సందర్భంగా కేజ్రీవాల్ తమకు సహకరించట్లేదని పేర్కొన్నారు. కేసు నుంచి తప్పించుకునేలా, తనకు ఏ మాత్రం సంబంధం లేనివిధంగా వ్యవహరించారని కోర్టుకు వివరించారు. సీబీఐ అధికారులు అడిగిన ప్రశ్నలకు పొంతన లేని సమాధానాలను ఇచ్చారని న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు.

ఆయన వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం.. కేజ్రీవాల్ రిమాండ్ను పొడిగించింది. ఈ నెల 25వ తేదీ వరకు జ్యుడీషియల్ కస్టడీని పొడిగించినట్లు వెల్లడించింది. ఈడీ కేసులో కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు అయినప్పటికీ- సీబీఐ కేసులో మాత్రం 25వ తేదీ వరకు కస్టడీలోనే కొనసాగాల్సి వచ్చింది.
ఇదే కేసులో భారత్ రాష్ట్ర సమితి సీనియర్ నాయకురాలు, శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత కూడా అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈడీ, సీబీఐ అధికారుల అదుపులో ఉన్నారామె. తీహార్ జైలులో ఉంటూ విచారణను ఎదుర్కొంటోన్నారు. సీబీఐ కేసులో జ్యుడీషియల్ రిమాండ్ను జులై 18వ తేదీ వరకు పొడిగించింది ఇదే రోస్ అవెన్యూ కోర్టు.












Click it and Unblock the Notifications