దుమ్మురేపిన కేజ్రీవాల్: మోడికి హెచ్చరిక, ప్రతిపక్ష హోదా కూడా...
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ దుమ్మురేపింది. 70 అసెంబ్లీ స్థానాలకు గాను ఏఏపీ దాదాపు అరవై అయిదు స్థానాలను గెలుచుకుంటోంది. అదే సమయంలో భారతీయజనతా పార్టీ మట్టికరిచింది. ఆ పార్టీ కేవలం మూడు సీట్లను మాత్రమే గెలుచుకుంది.
ఈ గెలుపు ద్వారా అరవింద్ కేజ్రీవాల్ ఒక్కసారిగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టపై నీలిమేఘాలు కమ్ముకున్నాయి. సార్వత్రిక ఎన్నికల సమయం నుండి మోడీ హవా అంటూ బీజేపీ చెప్పుకుంది. ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ పూర్తిగా మట్టికరవడంతో.. ఇవి మోడీ పాలనకు రిఫరెండే కాదని ఆ పార్టీ చెబుతోంది.
ప్రధాని నరేంద్ర మోడీ హవాకు కేజ్రీవాల్ చెక్ చెప్పారని అంటున్నారు. ఢిల్లీని మినీ ఇండియా అంటారు. అలాంటి ఢిల్లీలో బీజేపికీ చెక్ చెప్పడం ద్వారా మోడీకి కేజ్రీ హెచ్చరికలు జారీ చేశారని అంటున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. గత ఎన్నికల్లో ఆ పార్టీ 33 స్థానాలు గెలుచుకుంది.
అలాంటి అరవింద్ కేజ్రీవాల్ గెలుపు వెనుక ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు ఆయన సతీమణి సునీత కేజ్రీవాల్ కూడా ఉన్నారు. తన భార్య సునీత సహకారం లేకుంటే తాను ఏమీ సాధించేవాడిని కాదని కేజ్రీవాల్ చెప్పారు. కేజ్రీవాల్ తన భార్య సునీతను ఏఏపీ కార్యకర్తలకు పరిచయం చేశారు. అందరు కలిసికట్టుగా పని చేద్దామన్నారు.
ఏఏపీకి సహకరిస్తాం: వెంకయ్యనాయుడు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఢిల్లీలో ఏఏపీ ప్రభుత్వానికి సహకరిస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పనితీరుకు రెఫరెండం కాదని స్పష్టం చేశారు. ఢిల్లీ ప్రభుత్వానికి కేంద్రం మద్దతు ఉంటుందని వెంకయ్యనాయుడు తెలిపారు.