పోస్టర్ వివాదం: కేజ్రీవాల్కు కిరణ్ బేడీ లీగల్ నోటీసు
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్కు భారతీయ జనతా పార్టీ ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్ధి కిరణ్ బేడీ మంగళవారం లీగల్ నోటీసు పంపారు. తన అనుమతి లేకుండా తన ఫోటోను వాడుకున్నారని, పోస్టర్లు తొలగించాలని కోరారు.
ఈ విషయంపై ఢిల్లీ బీజేపీ మీడియా కన్వీనర్ ప్రవీణ్ శంకర్ కపూర్ మాట్లాడుతూ "అవును, కేజ్రీవాల్కు నోటీసు పంపాం. పోస్టర్ల తొలగింపుపై హామీ ఇవ్వాల్సిందిగా కోరారు" అని చెప్పారు. ఢిల్లీలో తిరిగే ఆటో రిక్షాలపై ఆమ్ ఆద్మీ పార్టీ పోస్టర్లను అంటించింది.
ఈ పోస్టర్లపై ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ కావాలో కిరణ్ బేడీ కావాలో తేల్చుకొండంటూ రాసి ఉంది. ఈ పోస్టర్లపై ప్రచురించిన అరవింద్ కేజ్రీవాల్ చిత్రం కింద నిజాయితీ పరుడు అని రాయగా, కిరణ్ బేడీ చిత్రం కింద అవకాశవాది అని రాసి ఉంది. అంతక ముందు జగదీశ్ ముక్తీ కూడా కేజ్రీవాల్కు ఇదే విషయమై నోటీసులు పంపారు.
ఢిల్లీ ఎన్నికల్లో ఆప్, బీజేపీ పార్టీల మధ్య గట్టి పొటీ ఉంది. ఏఏపీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పదేపదే ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నారని బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్, బీజేపీలు ఇచ్చే డబ్బు తీసుకుని ఓటు మాత్రం ఏఏపీకు వేయాలని ప్రచారం చేస్తుండటంతో బీజేపీ కోపంగా ఉంది.
అంతే కాకుండా ఏఏపీపై ఈసీకి ఫిర్యాదు చేసేందుకు బీజేపీ సిద్ధమైంది. కొద్ది రోజుల క్రితం కేజ్రీవాల్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తాను ఓటర్లను లంచం తీసుకోమని చెప్పడం లేదంటూ కేజ్రీవాల్ ఈసీకి వివరణ ఇచ్చారు. ఫిబ్రవరి 7న ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.