ఢిల్లీ గ్యాంగ్ రేప్: 'తోసేశారు.. లేదంటే నన్నూ చంపేవారే'
న్యూఢిల్లీ: డిసెంబర్ 16న ఢిల్లీలో కదులుతున్న బస్సులో యువతిపై సామూహిక అత్యాచారం చేసిన దోషులు తనను కూడా చంపేసి ఉండేవారని కేసులో సాక్షి రామ్ అధర్ న్యాయస్థానానికి గురువారం తెలిపారు. ఆ రోజు ఘటన జరగడానికి ముందు తన వద్ద ఉన్న డబ్బులను లాక్కొని తనను బస్సు నుంచి కిందకు తోసేశారని, లేకుంటే తనను చంపేసేవారన్నారు. ఆయన వండ్రంగం పని చేస్తున్నారు.
రామ్ అధర్ నలుగురు నిందితులను కోర్టు హాలులో గుర్తించారు. ముఖేష్, వినయ్ శర్మ, పవన్ గుప్తా, అక్షయ్ సింగ్ ఠాకూర్లను ఆయన గుర్తించారు. వారు తనను కొట్టారని, తన వద్ద దోచుకున్నారని, ఆ తర్వాత తనను బస్సులో నుండి తోసేశారని చెప్పారు.
కాగా, దేశవ్యాప్తంగా ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న నిర్భయ కేసులో దోషులకు ఈ రోజు(శుక్రవారం) శిక్షలు ఖరారు కానున్నాయి. అత్యంత దారుణానికి ఒడిగట్టిన ఈ దుర్మార్గులకు ఉరి శిక్ష తప్ప మరేదీ సరికాదని ప్రజలు తీవ్ర ఆగ్రహావేశంతో నినదిస్తున్నారు.
"దోషులందర్నీ ఉరి తీస్తేనే న్యాయం చేసినట్లవుతుంది. మా బిడ్డ పట్ల అత్యంత పాశవికంగా ప్రవర్తించిన వారికి శిక్షలు ఖరారు చేసేటప్పుడు కోర్టు ఎందుకు పునరాలోచించాలి?'' అని నిర్భయ తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. దోషుల పట్ల ఎలాంటి సానుభూతి చూపరాదని, వారికి ఉరి శిక్ష విధించాల్సిందేనని ఢిల్లీ పోలీసులు కూడా కోరుతున్నారు. అయితే డిఫెన్స్ లాయర్ మాత్రం ఈ నలుగురిలో పరివర్తన తీసుకురావడానికి అవకాశం ఇవ్వాలని కోర్టును కోరారు. ఈ నేపథ్యంలో సాకేత్లోని కోర్టు ఈ రోజు మధ్యాహ్నం దోషులకు శిక్షలు ఖరారు చేయనుంది.