ట్రబుల్ షూటర్ కేసులో ఈడీకి ట్రబుల్?: నోటీసులు జారీ చేసిన ఢిల్లీ హైకోర్టు!
న్యూఢిల్లీ: కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీమంత్రి డీకే శివకుమార్ కేసు వ్యవహారంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ (ఈడీ) కార్యాలయం అధికారులు ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. డీకే శివకుమార్ బెయిల్ పిటీషన్ పై విషయంలో ఢిల్లీ ఉన్నత న్యాయస్థానం వారికి నోటీసులను జారీ చేసింది. డీకే శివకుమార్ బెయిల్ పిటీషన్ విషయంపై తమ వైఖరేంటో స్పష్టం చేయాలని సూచించింది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సురేష్ కుమార్ కైట్ సోమవారం ఉదయం నోటీసులను జారీ చేశారు. డీకే శివకుమార్ కు బెయిల్ ఇవ్వాలా? వద్దా? అనే విషయాన్ని స్పష్టం చేయాలని ఆదేశించారు.
14 వరకు తీహార్ జైలులోనే డీకే..
దీనితో పాటు ఈ కేసు విచారణను వచ్చేనెల 14వ తేదీకి వాయిదా వేశారు. అప్పటిదాకా డీకేశి తీహార్ జైలులోనే ఉండాల్సి రావడం ఖాయంగా కనిపిస్తోంది. కర్ణాటక కాంగ్రెస్ లో ట్రబుల్ షూటర్ గా పేరున్న డీకే శివకుమార్ కు బెయిల్ వస్తుందని ఆశిస్తోన్న ఆయన అభిమానులు, పార్టీ నాయకులకు ఇది చేదు వార్తేనని అంటున్నారు. మరి కొన్ని రోజుల పాటు ఆయన తీహార్ జైలులోనే గడపాల్సి రావడం పట్ల కార్యకర్తల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమౌతున్నాయి. రాజకీయ కారణాలతో భారతీయ జనతాపార్టీ ప్రభుత్వం డీకే శివకుమార్ ను వేధిస్తోందని వారు ఆరోపిస్తున్నారు.
బెయిల్ పిటీషన్ రద్దు..
నిజానికి- డీకే శివకుమార్ దాఖలు చేసిన బెయిల్ పిటీషన్ ను ట్రయల్ కోర్టు ఇదివరకే కొట్టేసింది. శివకుమార్ కు పలుకుబడి ఉందని, ఆయనకు బెయిల్ ఇస్తే.. కేసును, సాక్ష్యాధారాలను తారుమారు చేయగలరంటూ ఈడీ తరఫు న్యాయవాది వాదించారు. ఆయన వాదనలతో ట్రయల్ కోర్టు ఏకీభవించింది. బెయిల్ పిటీషన్ ను కొట్టేసింది. దీన్ని సవాలు చేస్తూ డీకే శివకుమార్ తాజాగా ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. రోజుల తరబడి ఈడీ అధికారులు తనను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటిదాకా కూడా తాను మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు ఒక్క ఆధారాన్ని కూడా అధికారులు సేకరించలేకపోయారని అన్నారు.
ఈడీకి నోటీసులు..
ఏడుసార్లు ఎమ్మెల్యేగా, కేబినెట్ మంత్రిగా పనిచేసిన డీకే శివకుమార్ మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు ఈడీ అధికారులు సాక్ష్యాధారాలను సేకరించడంలో విఫలం అయ్యారని, దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆయనకు బెయిల్ ఇవ్వాలంటూ మయాంక్ జైన్ ఈ పిటీషన్ ను దాఖలు చేశారు. పైగా ఆయన ప్రజా ప్రతినిధిగా ఉన్నందున బెయిల్ కాలంలో ఎక్కడికీ పారిపోయే అవకాశం కూడా లేదని మయాంక్ జైన్ తన పిటీషన్ లో పేర్కొన్నారు. డాక్యుమెంట్ల ఆధారంగా డీకేను అరెస్టు చేశారే తప్ప, ఎలాంటి అదనపు సాక్ష్యాధారాలను ఈడీ అధికారులు సేకరించలేకపోయారని అన్నారు. దీన్నిపై ఢిల్లీ హైకోర్టు ఈడీకి నోటీసులను జారీ చేసింది.