ఢిల్లీ హర్రర్: దెయ్యం పట్టిన తండ్రి.. కూతురి చెవులు కోసేశాడు..
ఆపై ఆ చిన్నారి రెండో చెవి కూడా కోసి మరింత పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు. అంత చేసి.. దెయ్యం ఇంకా శాంతించలేదని, సంతృప్తి చెందలేదని కూతురి గొంతు కొరకబోయాడు. ఇంతలో ఇదంతా గమనించిన పొరుగువాళ్లు.. పోలీసులకు
న్యూఢిల్లీ: పెద్ద కూతురు చనిపోయిందన్న బాధ.. ఓ వ్యక్తిని సైకోలా మార్చివేసింది. ఉన్నట్లుండి అతీత శక్తులు ఆవహించిన వ్యక్తిలా.. పిచ్చి ప్రేలాపనలతో.. మిగతా కూతుళ్లపై కూడా దాడులు చేయడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో తన మూడేళ్ల చిన్న కుమార్తె చెవులు కోసేశాడు. అక్కడితో ఆగక.. ఆమె గొంతు కొరికి చంపబోయాడు. ఇంతలో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు కాబట్టి, ఆ పాప ప్రాణాలతో బయటపడింది. లేదంటే ఆమె కూడా విగత జీవిగా మిగిలిపోయేది.
పోలీసుల కథనం ప్రకారం.. ఢిల్లీకి చెందిన బహదూర్ అనే వ్యక్తి క్లీనర్గా పనిచేస్తున్నాడు. ఇతనికి ఆరుగురు సంతానం కాగా.. అందులో మొదటి కుమార్తె ఇటీవల అనారోగ్యంతో చనిపోయింది. అప్పటినుంచి బహదూర్ మానసిక స్థితి సరిగా లేదు. ఆ బాధ నుంచి తేరుకోలేక పిచ్చిగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఈమధ్య దెయ్యంతో తనతో మాట్లాడుతోందని.. చిన్న కుమార్తెను కూడా చంపేయ్యమంటోందని పిచ్చి పిచ్చిగా వాగడం మొదలుపెట్టాడు.
గురువారం అర్థరాత్రి 1.30గం.కు అన్నంత పనిచేశాడు బహదూర్. ఆ సమయంలో తాగి ఇంటికి వచ్చిన బహదూర్ నిద్రిస్తున్న చిన్న కుమార్తె చెవి కోసేశాడు. చిన్నారి ఏడుపు విని అతని భార్య లేచి చూసేసరికి చిన్నారి రక్తపు మడుగులో ఉంది. పాపని ఆసుపత్రికి తీసుకెళ్లడానికి ప్రయత్నించగా.. భార్యను సైతం చితకబాదాడు. భార్యను, మిగతా పిల్లలను గదిలో పెట్టి తాళం వేశాడు.
ఆపై ఆ చిన్నారి రెండో చెవి కూడా కోసి మరింత పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు. అంత చేసి.. దెయ్యం ఇంకా శాంతించలేదని, సంతృప్తి చెందలేదని కూతురి గొంతు కొరకబోయాడు. ఇంతలో ఇదంతా గమనించిన పొరుగువాళ్లు.. పోలీసులకు సమాచారం అందించారు. సకాలంలో వారు ఆ ఇంటికి చేరుకోవడంతో పాప ప్రాణాలు దక్కాయి. ప్రస్తుతం బహదూర్ పోలీసుల అదుపులో ఉన్నాడు. గాయపడ్డ చిన్నారికి ఎయిమ్స్ లో చికిత్స అందించారు.