యమ డిమాండ్ : రాజకీయ సెటైర్లు సామాజిక సందేశంతో... ఢిల్లీ గాలిపటాల మార్కెట్ రెడీ
Recommended Video
భారత స్వాతంత్ర్య వేడుకలకు కొద్దిరోజులు మాత్రమే సమయం ఉంది. అప్పుడే ఢిల్లీ, పరిసర రాష్ట్రాల్లోని పతంగి ప్రేమికులు పెద్ద సంఖ్యలో ఢిల్లీలోని ప్రసిద్ధిగాంచిన లాల్ కౌన్ మార్కెట్లో వాలిపోయారు. ఎన్ని ఎక్కవ పతంగులైతే అన్ని పతంగులను తీసుకెళ్లేందుకు అందరూ అక్కడికి చేరుకున్నారు. పతంగులకే ఇంత పోటీ ఏమిటని మీకో ప్రశ్న మదిలో మెదలొచ్చు... అసలు విషయం ఈ పతంగుల్లోనే ఉంది.
ఆగష్టు 15న స్వాతంత్ర దినోత్సవ వేడుకలు తర్వాత చాలామంది పతంగులు ఎగురవేస్తారు. ఇంకా కొన్ని రోజులు సమయం ఉండగానే ఇప్పుడే ఆ పతంగులను కొనుగోలు చేసేందుకు క్యూలు కడుతున్నారు ఎందుకంటే ఆరోజున కొంచెం కూడా సమయం వృథా చేసుకునేందుకు ఇష్టపడరు పతంగి ప్రియులు. అందుకోసమే ముందే పతంగులు కొనిపెట్టుకుంటున్నారు. అంతేకాదు ఇక్కడి పతంగులు వివిధ రూపాల్లో, సైజుల్లో, రంగుల్లో లభిస్తాయి.కొన్ని పతంగుల మీద ఒక సందేశం కూడా వస్తుంది. రాజకీయాలనుంచి క్రీడల వరకు, కార్టూన్ క్యారెక్టర్స్ నుంచి సూపర్ హీరోల వరకు అన్నీ ఇక్కడ దొరికే పతంగులపై ఉంటాయి.
మోడీ వర్సెస్ రాహుల్ పతంగి
ప్రతిసారి బాలీవుడ్ స్టార్స్ బొమ్మలుండే పతంగులకు ఎక్కువ డిమాండ్ ఉండేది. కానీ ఈసారి మాత్రం రాజకీయనేతల ఫోటోలున్న గాలిపటాలకే ఎక్కువ డిమాండ్ ఏర్పడింది. ఇందుకు కారణం కొన్ని నెలల్లో భారతదేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. అందుకే ఇక్కడ కనిపించే మహాసంగ్రామం గాలిపటానికి ఎక్కవ డిమాండ్ ఉందంటున్నారు విక్రయదారులు. అంతేకాదు ప్రజలు వచ్చే ఎన్నికలను మోడీ రాహుల్ గాంధీల మధ్య యుద్ధంలా చూస్తున్నారని.. అందుకే వారి ఫోటోలున్న గాలిపటాలు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయని దుకాణాదారులు చెబుతున్నారు. ఈ దుకాణంలో తాను మూడో తరం వ్యక్తినని నరేష్ అనే వ్యక్తి తెలిపాడు. ప్రధాని నరేంద్ర మోడీ చాలా పాపులర్గల నేత అని అతనితో పాటు యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఫోటోతో ఉన్న గాలిపటాలు కూడా బాగా అమ్ముడుపోతున్నట్లు చెప్పాడు.మహాసంగ్రామం పేరుతో ఉన్న పతంగులు ఇప్పటివరకు 50వేల దాకా అమ్ముడుపోయాయని చెప్పాడు లోకేష్ కుమార్ అనే మరో గాలిపటాల వ్యాపారి.
ఈ ఒక్క సీజన్ కోసమే సంవత్సరమంతా గాలిపటాలు చేస్తాం
ఈ ఒక్కవారంలోనే ఢిల్లీ 6 ప్రాంతమంతా గాలిపటాలతో నిండిపోతుందని దుకాణాదారులు చెబుతున్నారు. కొన్ని దశాబ్దాలుగా ఇక్కడి ప్రజలు స్వాత్వంత్ర దినోత్సవంకు ఒకవారం ముందునుంచే గాలిపటాలు ఎగురవేస్తుంటారని చెబుతున్నారు పతంగి ప్రేమికులు."ఈ ఒక్క వారం జరిగే వ్యాపారం కోసమే తాము సంవత్సరం నుంచి గాలిపటాలు తయారు చేసే పనిలో ఉంటాం. ఇక్కడి ప్రజలు ఈ వారమంతా పతంగులు ఎగురవేస్తారు. అంతేకాదు... ఎవరి ఇంటిపైనుంచి ఎవరైనా పతంగులను ఎగురవేస్తారు. వారిని ఎవరూ ఏమి అనరు. ఎందుకంటే గాలిపటాలు ఎగురవేస్తూ ఇక్కడి ప్రజలు స్వాతంత్ర్య వేడుకలను జరపుకుంటారు."అని గత 35 ఏళ్లుగా ఈ వ్యాపారం చేస్తున్న షబ్బీర్ అహ్మద్ అనే 60 ఏళ్ల వ్యక్తి వివరించాడు.
బాలీవుడ్ హీరోల పతంగులకు గుడ్ బై...సామాజిక మెసేజ్లు హిట్
గాలిపటాలు సామాజిక బాధ్యతలను కూడా గుర్తు చేస్తాయి.ఇది గత కొన్నేళ్లుగా జరుగుతోంది. లాల్ కౌన్ మార్కెట్లో దొరికే పతంగులు ఒకప్పుడు బాలీవుడ్ హీరోల ఫోటోలతో దొరికేవి. కాని కాలం మారుతున్న కొద్దీ వాటికి డిమాండ్ అంతే స్థాయిలో పడిపోయింది. ఇప్పుడు సామాజిక మెసేజ్లున్న గాలిపటాలకు బాగా డిమాండ్ ఏర్పడింది. ఉదాహరణకు భేటీ పఢావో, భేటీ బచావో లాంటి సోషల్ మెసేజ్లున్న గాలిపటాలను కస్టమర్లు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారని దుకాణాదారులు చెబుతున్నారు.
వ్యంగ్య సందేశాలున్న పతంగులకు యమ క్రేజ్
పూర్వం గాలిపటాలపై సందేశం పంపేవారు. అదే సందేశం ఒక్కింత వ్యంగ్యంగా ఉంటే వాటిని చాలామంది ఇష్టపడుతారని దుకాణాదారులు చెబుతున్నారు. అందుకే 2014 ఎన్నికల్లో మోడీ అచ్చేదిన్ నినాదంతో ప్రచారం నిర్వహించారు. ఇప్పుడు ఈ పతంగులపైన అచ్చేదిన్ ఆయేగా అంటూ చిన్నవ్యంగ్యమైన సందేశం రాయడంతో ఈ గాలిపటాలు బాగా అమ్ముడుపోతున్నట్లు వారు చెప్పారు. అంతేకాదు వికాస్ అంటే అభివృద్ధి అనే పదం సోషల్ మీడియాలో పెద్ద హిట్. అయితే వికాస్ అనేదాన్ని చాలామంది పలురకాలుగా వాడుతున్నారు. వికాస్ అని చెప్పి ప్రధాని మోడీ ఎలాగైతే తన హామీలను నిలబెట్టుకోకుండా ఉన్నారో చెబుతూ "మై హూ వికాస్" అని వ్యంగ్యంగా రాసి దానిపై మోడీ ఫోటో ముద్రించడంతో అవి సూపర్ హిట్ అవుతున్నాయని చెబుతున్నారు.