ఢిల్లీ లాక్డౌన్: షాకిచ్చిన కేజ్రీవాల్: ఉన్నట్టుండి కీలక ప్రకటన..పొడిగింపు
న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించడానికి దేశ రాజధానిలో లాక్డౌన్ అమల్లో ఉంటోంది. ఈ నెల 19వ తేదీన ఢిల్లీలో లాక్డౌన్ అమల్లోకి వచ్చింది. దీని గడువు సోమవారం తెల్లవారు జామున ముగియాల్సి ఉంది. ఇంకొన్ని గంటల్లో లాక్డౌన్ ముగుస్తుందనగా.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక ప్రకటన చేశారు. లాక్డౌన్ను మరో వారం రోజుల పాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. వచ్చేనెల 3వ తేదీ.. సోమవారం వరకూ లాక్డౌన్ను పొడిగిస్తున్నట్లు వెల్లడించారు. తెల్లవారు జామున 5 గంటల వరకు అమల్లో ఉంటుందని తెలిపారు.
ఈ నెల 19వ తేదీన అరవింద్ కేజ్రీవాల్ చేసిన తొలి ప్రకటన ప్రకారం.. రాత్రి 10 గంటల నుంచి ఈ నెల 26వ తేదీ తెల్లవారు జామున 6 గంటల వరకు లాక్డౌన్ అమల్లో ఉండాల్సి ఉంది. రోజూ పాతిక వేల వరకు నమోదవుతోన్న కరోనా వైరస్ పాజిటివ్ కేసులను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ సర్కార్ అప్పట్లో ఈ నిర్ణయాన్ని తీసుకుంది. కరోనా కట్టడికి లాక్డౌన్ను విధించడం మినహా మరో ప్రత్యమ్నాయం లేదని తెలిపింది. ఈ వారం రోజుల వ్యవధిలో రోజువారీ కరోనా వైరస్ కేసుల్లో పెద్దగా మార్పులేమీ కనిపించని ఢిల్లీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

దీన్ని దృఫ్టిలో ఉంచుకుని లాక్డౌన్ను మరో వారం రోజుల పాటు పొడిగించినట్లు కేజ్రీవాల్ తాజాగా వెల్లడించారు. లాక్డౌన్ పొడిగింపుపై ఢిల్లీవాసుల నుంచి అభిప్రాయాలను సేకరించినట్లు పేర్కొన్నారు. మెజారిటీ ప్రజల సూచనలు, సలహాల మేరకే లాక్డౌన్ను వచ్చే సోమవారం అంటే.. మే 3వ తేదీ తెల్లవారు జామున 5 గంటల వరకు పొడిగించామని ఆయన వివరించారు. ఆక్సిజన్ నిల్వలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా ఓ పోర్టల్ను ఆరంభించినట్లు ఆయన చెప్పారు.
ఆక్సిజన్ తయారీదారుల ద్వారా ఈ పోర్టల్ ప్రతి రెండు గంటలకోసారి అప్డేట్ అవుతుంటుందని చెప్పారు. ఆక్సిజన్ సరఫరాదారులు, ఆసుపత్రుల మధ్య సమన్వయం కోసమే దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చామని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ఆక్సిజన్ నిల్వలపై పనిచేస్తాయని, సత్వర నిర్ణయాలను తీసుకుంటాయని చెప్పారు. కాగా ఢిల్లీలో 24 గంటల వ్యవధిలో 24 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. 357 మంది మరణించారు. ఇప్పటిదాకా నమోదైన కరోనా మరణాలు 13,898కి చేరుకున్నాయి. మొత్తం కేసులు 10 లక్షలకు పైమాటే.












Click it and Unblock the Notifications