కిరణ్ బేడీ మళ్లీ రావాలి... నినాదాలతో హోరెత్తిన ఢిల్లీ పోలీస్ హెడ్ క్వార్టర్స్:
ఢిల్లీ: ఢిల్లీలో లాయర్లు పోలీసుల మధ్య జరిగిన గొడవ ఆ తర్వాత పరిణామాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. లాయర్లపై చర్యలు తీసుకోవాలంటూ ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ ముందు పోలీసులు నిరసనలకు దిగారు. దీంతో ఢిల్లీ పోలీస్ కమిషనర్ అమూల్య పట్నాయక్ రంగంలోకి దిగి పోలీసులను శాంతిపజేసేందుకు ప్రయత్నించారు. తప్పకుండా పోలీసులకు న్యాయం జరుగుతుందని వెంటనే నిరసనలు మానేసి విధుల్లో చేరాలంటూ ఆయన పోలీసులను కోరారు. పోలీస్ కమిషనర్ చెప్పినప్పటికీ పోలీసులు వెనక్కు తగ్గలేదు. దాడికి సంబంధించి పోలీసులకు హైకోర్టులో న్యాయం జరుగుతుందని కమిషనర్ అమూల్య పట్నాయక్ చెప్పారు.

నిరసనలు ఆపివేసి విధుల్లో చేరండి: కమిషనర్
న్యాయవ్యవస్థపై నమ్మకం ఉంచి పోలీసులు నిరసనలు నిలిపివేయాలని పట్నాయక్ కోరారు. సోమవారం కూడా పోలీసులపై లాయర్లు దాడి చేయడం అనేది క్షమించరానిదన్న కమిషనర్ దీనిపై చట్టపరంగా పోరాడుదాం అని పిలుపునిచ్చారు. ముందుగా నిరసనలు కొంతమంది పోలీసులు మాత్రమే వ్యక్తం చేశారు. అయితే నిరసనలకు దిగారన్న వార్త దావనంలా పాకడంతో వందల సంఖ్యలో పోలీసులు తమ విధులకు బ్రేక్ ఇచ్చి పోలీస్ హెడ్క్వార్టర్స్కు చేరుకుని గొంతును కలిపారు. గంటగంటకు నిరసనల్లో పాల్గొనే పోలీసుల సంఖ్య పెరిగిపోతుండటంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. అంతేకాదు ఒక మార్గంను ట్రాఫిక్ పోలీసులు మూసివేయడం జరిగింది.

కిరణ్ బేడీ మళ్లీ రావాలి అంటూ నినాదాలు
ఢిల్లీకి పోలీస్ కమిషనర్గా వ్యవహరించిన ప్రస్తుత పుదుచ్చేరి లెఫ్ట్నెంట్ గవర్నర్ కిరణ్ బేడీ మళ్లీ రావాలంటూ ఢిల్లీ పోలీసులు నినదించారు. కిరణ్ బేడీ ఫోటోతో కూడిన ఫ్లకార్డులను ప్రదర్శించారు. ఇదిలా ఉంటే తాము నిరసనలు చేపట్టేందుకు రాలేదని తమ బాధను పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చేందుకు వచ్చామని చెప్పారు. అంతేకాదు న్యాయవృత్తిలో ఉన్న వారే తమ సాధక బాధకాలను వినకుంటే ఇంకెవరు వింటారని ప్రశ్నించారు. న్యాయవృత్తిలో ఉన్నవారే పోలీసులపై చేయి చేసుకుంటే సామాన్య ప్రజలు తమను లెక్కచేస్తారా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
పార్కింగ్ విషయంలో పోలీసులకు లాయర్లకు గొడవ
తీస్ హజారీ కోర్టులో పార్కింగ్ విషయంలో పోలీసులకు లాయర్లకు శనివారం గొడవ జరిగింది. ఈ హింసాత్మక ఘటనలో 20 మంది పోలీసులకు గాయాలయ్యాయి. అదే సమయంలో 40 మంది లాయర్లకు కూడా గాయాలైనట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం తీసుకున్న ఢిల్లీ హైకోర్టు ఇద్దరు సీనియర్ పోలీస్ ఆఫీసర్లను బదిలీ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. మరో ఇద్దరిపై వేటు వేయడమే కాకుండా గాయపడిన లాయర్లకు పరిహారం చెల్లించాలని ఆదేశించింది. అయితే లాయర్లపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పోలీసులను బాధించింది.
సోమవారం మరో పోలీసుపై లాయర్ల దాడి
ఇక ఈ గొడవ జరుగుతుండగానే సోమవారం రోజున మరికొంతమంది పోలీసులపై లాయర్లు దాడి చేశారు. ఈ దృశ్యాలు అక్కడే ఉన్న కెమెరాల కంటికి చిక్కాయి. సాకేత్ కోర్టు బయట ఓ కానిస్టేబుల్పై కొందరు లాయర్లు దాడి చేస్తున్న దృశ్యాలు బయటకు వచ్చాయి.ఇక దాడిలో గాయపడ్డ కానిస్టేబుల్ వెంటనే తన బైక్ను తీసుకుని అక్కడి నుంచి పారిపోయాడు. ఇక ఈ వీడియోలో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో విషయం తెలిసి కూడా పోలీసు ఉన్నతాధికారులు స్పందించకపోవడంపై నిరసనలకు దిగారు కానిస్టేబుళ్లు.

వీవాంట్ జస్టిస్ నినాదం
పోలీసులుగా ఎన్నో సవాళ్లను అధిగమించామని చెప్పిన పోలీస్ కమిషనర్, ఎన్నో పరిస్థితులను కూడా ఎదుర్కొన్నట్లు చెప్పారు. పోలీస్ కమిషనర్ ప్రసంగిస్తున్నంత సేపు వీవాంట్ జస్టిస్ అనే నినాదాలతో ప్రాంగణం మారుమోగిపోయింది. సోమవారం జరిగిన ఘటనపై జ్యూడీషియల్ ఎంక్వైరీకి హైకోర్టు ఆదేశించిందని చెప్పారు పట్నాయక్. నిష్పక్షపాతంగా, పారదర్శకతతో కూడిన విచారణ జరుగుతుందని పట్నాయక్ హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications