ముస్లిం విద్యార్దుల్ని కించ పరిచే వ్యాఖ్యలు-ఢిల్లీలో మరో టీచర్ పై కేసు నమోదు..
యూపీలో ముస్లిం విద్యార్ధిని తోటి విద్యార్దులతో చెంపదెబ్బలు కొట్టించిన టీచర్ ఘటన మరువక ముందే ఢిల్లీలో మరో ఇలాంటిదే ఘటన చోటు చేసుకుంది. ఢిల్లీలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో పాఠాలు చెప్పాల్సిన మహిళా టీచర్.. ముస్లింలు మంచి వారు కాదంటూ ఇతర మతాల పిల్లలకు నీతులు చెప్పిన ఘటన కలకలం రేపింది. సదరు విద్యార్ధుల తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారంపై కేసు నమోదైంది.
ఢిల్లీ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు తన తరగతిలోని ముగ్గురు లేదా నలుగురు ముస్లిం విద్యార్థులపై మతపరమైన దూషణలను ప్రయోగించినందుకు కేసు నమోదు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. 9వ తరగతి విద్యార్థులు ఆగస్టు 23న చంద్రయాన్-3 మూన్ మిషన్ విజయవంతమవడంతో సంబరాలు చేసుకుంటున్న సందర్భంగా ఉపాధ్యాయురాలు హేమా గులాటి తమను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు.

తరగతిలో పిల్లలను దుర్భాషలాడడం, మతపరమైన దూషణలను ఉపయోగించిన ఉపాధ్యాయురాలిపై ఫిర్యాదు చేసేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు ఢిల్లీ పోలీసు, విద్యా డైరెక్టరేట్ను ఆశ్రయించారు. విద్యార్థులు, వారి కుటుంబసభ్యులు పాఠశాల బయట నిరసన తెలిపారు.ఈ సందర్భంగా సదరు మహిళా టీచర్ తమ విద్యార్ధులతో ఏం చెప్పారో వారు పూసగుచ్చినట్లు వివరించారు. దీంతో ఈ ఉదంతం దేశ రాజధానిలో కలకలం రేపుతోంది.
ముస్లింలు చెడ్డవారని ఆమె తమ పిల్లలకు చెప్పిందని తల్లితండ్రులు ఆరోపించారు. అలాగే తమ మత గ్రంథాలు, ప్రార్థనా స్థలాల గురించి అనుచితంగా మాట్లాడిందన్నారు. ముస్లింలు తమ మతపరమైన ప్రదేశాలలో జంతువుల చర్మాన్ని ఉపయోగిస్తారని ఆమె చెప్పిందని, క్లాసులో చెప్పిన విషయాలు భయంకరమైనవని, అర్థం లేనివని వారు విమర్శించారు. ఆమె విద్యార్థులను లక్ష్యంగా చేసుకుందని, స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ముస్లింలు దేశానికి ఏమీ చేయలేదని వారికి చెప్పిందని ఒక విద్యార్థి కుటుంబ సభ్యుడు తెలిపారు.












Click it and Unblock the Notifications