విషాదం : యువ వైద్యుడి ఆత్మహత్య... కళ్లముందే కరోనా బాధితులు పిట్టల్లా రాలిపోతుంటే తట్టుకోలేక...
ఢిల్లీలో విషాదం చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్న వైద్యుడు విపరీతమైన ఒత్తిడికి లోనై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కోవిడ్ పేషెంట్లకు చికిత్సకు అందిస్తున్న ఆ వైద్యుడు ప్రతీరోజూ పదుల సంఖ్యలో మరణాలను చూసి కుంగిపోయాడు. అతని మరణానికి వ్యవస్థ వైఫల్యమే కారణమని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ చీఫ్ డా.రవి వాంఖేడ్కర్ పేర్కొనడం గమనార్హం.
'ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్కి చెందిన డా.వివేక్ రాయ్ ఒక అద్భుతమైన వైద్యుడు. కరోనా బారినపడిన వందలాది పేషెంట్లను కాపాడేందుకు ఎంతో కృషి చేశాడు. గత నెల రోజులుగా ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కోవిడ్ పేషెంట్లకు డా.వివేక్ చికిత్స అందిస్తున్నారు. ప్రతీరోజూ ఏడు నుంచి ఎనిమిది మంది పేషెంట్లకు చికిత్స చేస్తున్నాడు. ఈ క్రమంలో రోజూ కోవిడ్ బాధితుల మరణాలను చూసి అతను కుంగిపోయాడు.' అని రవి వాంఖేడ్కర్ తెలిపారు.

తన పర్యవేక్షణలో ఉన్న కోవిడ్ బాధితుల మరణాన్ని డా.వివేక్ రాయ్ తట్టుకోలేకపోయారని... మానసికంగా చాలా ఆవేదనకు గురయ్యారని తెలిపారు. ఈ క్రమంలోనే ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారని చెప్పారు. రాయ్కి భార్య ఉందని... ప్రస్తుతం ఆమె రెండు నెలల గర్భవతి అని తెలిపారు.
డా.వివేక్ రాయ్ మరణం ముమ్మాటికీ వ్యవస్థ చేసిన హత్యేనని రవి వాంఖేడ్కర్ ఆరోపించారు. ప్రాథమిక ఆరోగ్య సౌకర్యాల కొరత కారణంగా హెల్త్ కేర్ వ్యవస్థపై ఒత్తిడి పెరిగి యువ వైద్యులు డిప్రెషన్కి గురవుతున్నారని పేర్కొన్నారు.
COVID WARRIOR dies by Suicide
— Prof Dr Ravi Wankhedkar (@docraviw) May 1, 2021
Dr Vivek Rai,
Resident dr of DNB 1st year at Max Hospital Saket Delhi.
He Was doing covid duty since 1 month and was dealing with icu pts every day and was providing cpr and ACLS for about 7 to 8 patients per day in which not many were surviving. pic.twitter.com/ha5v09Cjwh
దేశంలో హెల్త్ కేర్ వ్యవస్థ తగినంతగా అభివృద్ది చెందకపోవడంతో ప్రస్తుతం ఉన్న ఆస్పత్రులపై విపరీతమైన ఒత్తిడి నెలకొంది. వైద్యుల సంఖ్య కూడా దేశంలో తక్కువగా ఉండటంతో లక్షలాది కోవిడ్ పేషెంట్లను ట్రీట్ చేయడం కష్టంగా మారుతోంది. ఈ క్రమంలో డా.వివేక్ రాయ్ లాంటి యువ వైద్యులు ఆత్మస్థైర్యం కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడటం మరింత కలచివేసే విషయం.
ఇప్పటికీ ఢిల్లీలోని చాలా ఆస్పత్రులు ఆక్సిజన్ కొరతతో సతమతమవుతున్నాయి. తాజాగా బాత్రా ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత కారణంగా 8 మంది కరోనా పేషెంట్లు మృతి చెందారు. కొద్దిరోజుల క్రితం సర్ గంగారాం ఆస్పత్రిలో 25 మంది,జైపూర్ గోల్డెన్ ఆస్పత్రిలో 20 మంది ఆక్సిజన్ అందక మృతి చెందిన సంగతి తెలిసిందే. ఓవైపు హైకోర్టు కేంద్రాన్ని హెచ్చరిస్తున్నా... మరోవైపు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆక్సిజన్ కావాలని కేంద్రానికి పదేపదే విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పటికీ పరిస్థితిలో మార్పు లేకపోవడం గమనార్హం.












Click it and Unblock the Notifications