అదనంగా చట్నీ వేయమన్నందుకు చితకబాదారు: కేసు
న్యూఢిల్లీ: ఓ హోటల్లో చోటుచేసుకున్న చిన్న వివాదం ఒకరిని ఐసీయూలో చేర్చగా, రెండు పోలీసు కేసుల నమోదుకు దారితీసింది. సన్నీ అనే యువకుడు ఓ హోటల్లో అదనంగా చట్నీ వేయమని అడిగినందుకు హోటల్ యజమాని చితకబాదాడు. దీంతో అతడు ఐసియూలో చేరాల్సి వచ్చింది. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది.
ఘటనకు సంబంధించి బాధితుడు సన్నీ తెలిపిన వివరాల ప్రకారం.. త్రిలోక్పురి ప్రాంతంలోని ఒక బేకరీలో అల్పాహారం తింటున్న అతను, మరికాస్త చట్నీ వేయమన్నాడు. దీంతో ఆ హోటల్ యజమాని కమల్ ఇనుపచువ్వతో దాడిచేశాడు.
యజమాని దాడిలో సన్నీకి తీవ్ర గాయాలయ్యాయి. కాగా, సన్నీ ఫిర్యాదుతో పోలీసులు కమల్ను అదుపులోకి తీసుకున్నారు. అయితే కమల్ ఫిర్యాదు మరో విధంగా ఉంది.
సన్నీ ముందు చట్నీ అడిగాడనీ, ఆ తర్వాత నిరాకరించి అనవసరంగా దుర్భాషలాడాడని చెప్పాడు. అంతేగాక, సన్నీ తన స్నేహితులతో కలిసి తమపై దాడి చేశాడని కమల్ తెలిపాడు. ఈ మేరకు కమల్ ఫిర్యాదుతో సన్నీపై కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.