డెల్టా ప్లస్ భయం : 11 రాష్ట్రాల్లో 48 డెల్టా ప్లస్ కేసులు, మహారాష్ట్రలోనూ డెల్టా ప్లస్ బాధిత మహిళ మరణం
కరోనావైరస్ యొక్క డెల్టా ప్లస్ వేరియంట్ ఇప్పుడు దేశంలోని 11 రాష్ట్రాలలో నమోదయినట్లుగా తెలుస్తుంది. మొత్తం దేశవ్యాప్తంగా 48 కేసులు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, గుజరాత్, కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, రాజస్థాన్, జమ్మూ మరియు కర్ణాటకలలో ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కరోనా మహమ్మారి ఒక సెకండ్ వేవ్ ఇంకా కొనసాగుతూనే ఉందని, డెల్టా ప్లస్ వేరియంట్ కనుగొన్న రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని, వాటిని స్థానికంగానే కట్టడి చెయ్యాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ పేర్కొన్నారు.
ముంచుకొస్తున్న ముప్పు : కరోనా థర్డ్ వేవ్ అనివార్యం, 6 నుండి 8 వారాలలోనే : ఎయిమ్స్ చీఫ్ గులేరియా
డెల్టా వేరియంట్ పై స్టడీ ఇంకా అవసరం
జీనోమ్ సీక్వెన్సింగ్ పని గురించి వివరణాత్మక ప్రదర్శన ఇస్తూ, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్కు చెందిన డాక్టర్ సుజీత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ, ఒక వేరియంట్ యొక్క జీనోమ్ సీక్వెన్సింగ్ 10-12 రోజులు పడుతుంది. డెల్టా ప్లస్ పేరిట ఉన్న ప్లస్ ఎక్కువ వ్యాప్తి చెందే అవకాశం ఉన్నట్లుగా సూచించదని డాక్టర్ సింగ్ అన్నారు. భారతదేశంలో మొదట నివేదించబడిన డెల్టా వేరియంట్ డిసెంబరులో దేశంలో కనిపించిందని డాక్టర్ సింగ్ తన ప్రదర్శనలో తెలిపారు.
డెల్టా వేరియంట్ గతేడాది డిసెంబర్ నుండి జూన్ వరకు 174 జిల్లాలకు వ్యాప్తి
మార్చి 2021 లో, వేరియంట్ 52 జిల్లాలకు వ్యాపించిందన్నారు . జూన్లో 174 జిల్లాలు వేరియంట్ను నివేదించాయని పేర్కొన్న ఆయన కానీ ప్రస్తుతం వ్యాప్తి ధోరణి తగ్గుతోందని వెల్లడించారు. ప్రస్తుతం, 35 రాష్ట్రాల్లోని 174 జిల్లాల్లో డెల్టా వేరియంట్ ఉందని పేర్కొన్నారు. మహారాష్ట్ర, ఢిల్లీ, పంజాబ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ మరియు గుజరాత్ నుండి డెల్టా వేరియంట్ కేసులు అత్యధికంగా నివేదించబడ్డాయని వెల్లడించారు.
డెల్టా ప్లస్ వేరియంట్ తో సంభవిస్తున్న మరణాలు
కొన్ని చోట్ల, డెల్టా వేరియంట్ కేసులు ప్రారంభంలో కనిష్టంగా ఉండేవి, తరువాత క్రమంగా డెల్టా ఆల్ఫాను స్వాధీనం చేసుకుందని చెప్పారు. డాక్టర్ సింగ్ మాట్లాడుతూ ఆల్ఫా కంటే డెల్టా బలంగా ఉందని అన్నారు. 10% నుండి 51% వరకు వ్యాపించే అవకాశం ఉందని, ఒక నెల రోజుల వ్యవధిలోనే డెల్టా వ్యాప్తి పెరుగుతుందని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే గత నెలలో మధ్యప్రదేశ్లో డెల్టా ప్లస్ వేరియంట్లో ఒకరు మరణించినట్లు వార్తలు రాగా ,తాజాగా మహారాష్ట్రలోని డెల్టా ప్లస్ మరణం సంభవించింది.
మహారాష్ట్రలోనూ ఒక మహిళ మరణం
రత్నగిరి జిల్లా సంగమేశ్వర్ ప్రాంతంలో 80 ఏళ్ల వృద్ధ మహిళ డెల్టా ప్లస్ బారినపడి మృతి చెందినట్టు మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తెలిపారు. అయితే ఆమెకు వయసుతో సంబంధమైన ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఉన్నట్లుగా ఆయన పేర్కొన్నారు. దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్ర డెల్టా ప్లస్ కేసులు ఉన్నాయని, మొత్తం మహారాష్ట్రలో 21 కేసులకు గాను, ఒకరు మరణించగా ప్రస్తుతం 20 కేసులు ఉన్నాయని వారందర్నీ వైద్య బృందాలు పర్యవేక్షిస్తున్నారు అని పేర్కొన్నారు.