మహిళా బిల్లు ముసుగులో..: నిప్పులు చెరిగిన ప్రియాంక
లోక్సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయిన అనంతరం అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. ఏపీ మినహా ఇతర దక్షిణాది రాష్ట్రాలన్నీ తీవ్రంగా ప్రతిఘటించిన ఈ డిలిమిటేషన్ బిల్లుపై సభలో అధికార పక్షానికి చుక్కెదురైంది. బిల్లు ఆమోదం పొందడానికి అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీ లభించకపోవడంతో ఇది వీగిపోయింది. దీంతో విపక్షాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమౌతోన్నాయి. బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో జోష్ కనిపిస్తోంది.
ఈ బిల్లు వీగిపోవడాన్ని స్వాగతించారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇది ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచేందుకు కేంద్రం పన్నిన కుట్ర అని ఆమె ఆరోపించారు. బిల్లు పరాజయాన్ని రాజ్యాంగానికి, దేశానికి దక్కిన అతి గొప్ప విజయంగా ఆమె అభివర్ణించారు. కొద్దిసేపటి కిందటే ఆమె దేశరాజధానిలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా కేంద్రం శాశ్వతంగా అధికారంలో కొనసాగాలని, దేశంలో ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచాలని చూస్తోందని విమర్శించారు. సమాఖ్య స్ఫూర్తిని మార్చడానికి, ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచడానికి కేంద్ర ప్రభుత్వం చేసిన ఓ భారీ కుట్ర పరాజయం పాలైందని పేర్కొన్నారు. ఇది రాజ్యాంగానికి, ప్రతిపక్షాల ఐక్యతకు దక్కిన గెలుపు అని, అధికార పార్టీ నాయకుల ముఖాల్లో ఇది స్పష్టంగా కనిపించిందని అన్నారు.
మహిళా రిజర్వేషన్ బిల్లు ముసుగులో దీర్ఘకాలం పాటు అధికారంలో ఉండటానికి బీజేపీ పన్నిన కుట్ర అని ప్రియాంక గాంధీ ధ్వజమెత్తారు. మహిళలను ఉపయోగించుకుని శాశ్వతంగా పాలిద్దామని బీజేపీ ప్రణాళిక వేసిందని ఆరోపించారు. బిల్లు ఆమోదం పొందితే తాము గెలిచామని, ఒకవేళ ఆమోదం పొందకపోతే ఇతర పార్టీలను మహిళా వ్యతిరేకులుగా ముద్ర వేసి తమను తాము రక్షకులుగా ప్రకటించుకోవచ్చని వారు భావించారని ఎద్దేవా చేశారు.
బిల్లు వీగిపోయిన సందర్భం.. కేంద్రానికి బ్లాక్ డే గా అభివర్ణించారు ప్రియాంక. అంచనాలకు అందని విధంగా షాక్ తగిలిందని చురకలు అంటించారు. ఇండియా కూటమి 2023 నాటి మహిళా రిజర్వేషన్ చట్టానికి పూర్తి మద్దతును ఇస్తుందని ప్రకటించారు. 2029 నాటికి దానిని తప్పక అమలు చేయాలని, కేంద్రం ఎలాంటి మార్పులు చేసినా అంగీకరిస్తామని తేల్చి చెప్పారు. దేశంలో పెరుగుతున్న ధరల సమస్యలను ఆమె బలంగా లేవనెత్తారు.
ప్రజలు అనేక సమస్యలతో బాధపడుతున్నారని, వంటగ్యాస్, నిత్యావసర సరుకుల ధరలన్నీ అనూహ్యంగా పెరిగిపోయాయని ప్రియాంక ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఆర్థిక భారం పూర్తిగా మహిళల భుజాలపై పడుతోందని, దీన్ని నివారించడానికి ముందుకు రాని కేంద్రం రిజర్వేషన్ పేరుతో డ్రామాలకు తెరతీసిందని మండిపడ్డారు. బీజేపీ మహిళా మోర్చా ఎన్ని డ్రామాలు అయినా ఆడవచ్చని సెటైర్లుు వేశారు. దేశం ఇప్పుడు మేల్కొందని, మహిళలు కేంద్ర ప్రభుత్వాన్ని ఏ మాత్రం నమ్మలేరని నిప్పులు చెరిగారు.












Click it and Unblock the Notifications