'విభజన కుట్ర జరిగింది అక్కడే.. ఆ భవనాన్ని కూల్చివేయండి'
భారత్-పాక్ విభజనకు గుర్తుగా దీన్ని వెంటనే కూల్చివేయాలని, ఈ నివాసంలోనే దేశ విభజనకు సంబంధించిన కుట్ర జరిగిందని ఆయన ఆరోపించారు.
ముంబై: ఏళ్లుగా నిరుపయోగంగా ఉన్న దక్షిణ ముంబైలోని మహమ్మద్ జిన్నా నివాసాన్ని కూల్చివేయాలని బీజేపీ ఎమ్మెల్యే, ప్రముఖ బిల్డర్ మంగళ్ ప్రభాత్ లొథా మహారాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. కాన్సులర్ కార్యాలయ ఏర్పాటు కోసం ఈ భవనాన్ని తమకు కేటాయించాలని పాక్ పలుమార్లు భారత్ ను అభ్యర్థించినా.. భారత్ ప్రతిస్పందించలేదు. జిన్నా కుమార్తె సైతం ఈ ఇంటిపై వారసత్వ హక్కుల కోసం గతంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
పాకిస్తాన్ వ్యవస్థాపకుడైన జిన్నా నివాసాన్ని కూల్చివేసి ఆ స్థానంలో ఒక సాంస్కృతిక కేంద్రాన్ని నెలకొల్పాలని మంగళ్ ప్రభాత్ సూచించారు. దక్షిణ ముంబయిలో సుమారు 2.5 ఎకరాల్లో ప్యాలెస్ తరహాలో ఈ నివాస భవనం ఉంది. భారత్-పాక్ విభజనకు గుర్తుగా దీన్ని వెంటనే కూల్చివేయాలని, ఈ నివాసంలోనే దేశ విభజనకు సంబంధించిన కుట్ర జరిగిందని ఆయన ఆరోపించారు.

నిరుపయోగంగా ఉన్న ఈ ఇంటి నిర్వహణ కోసం లక్షల రూపాయలు వెచ్చించడం అనవసరమని అన్నారు.
భవనం విషయానికొస్తే.. సముద్రానికి అభిముఖంగా ఉండే ఈ ప్యాలెస్ ను 1930లో నిర్మించారు. చాలా దశాబ్దాలు ఈ నివాసం బ్రిటన్ డిప్యూటీ హైకమిషనర్ అధికారిక నివాసంగా ఉంది. 1982లో ఆయన ఈ భవనాన్ని ఖాళీ చేసి వెళ్లిపోవడంతో అప్పటినుంచి నిరుపయోగంగా మారింది. దీంతో దీన్ని కూల్చివేయాలన్న డిమాండ్స్ తెరపైకి వస్తున్నాయి.












Click it and Unblock the Notifications