మోడీ ఎఫెక్ట్: బ్యాంకుల్లో కళ్లు తిరిగే డిపాజిట్లు, వారం లెక్క తేలింది!
న్యూఢిల్లీ: రూ.500, రూ.1000 నోట్ల రద్దు ద్వారా బ్యాంకులలో పెద్ద మొత్తంలో డబ్బు డిపాజిట్ అయింది. దేశవ్యాప్తంగా వారం రోజుల్లోనే రూ.3 లక్షల 75వేల కోట్లకు పైగా డబ్బులు జమ అయ్యాయి. నల్లధనాన్ని అరికట్టేందుకు రూ.500, రూ.1000 పాత నోట్లను రద్దు చేసి మంగళవారానికి వారం రోజులైంది.
'ఏటీఎంల నుంచి పాత నోట్లు వస్తున్నాయి, నరేంద్ర మోడీ పతనం ఖాయం'
అనంతర పరిణామాలతో దేశంలోని బ్యాంకులు, ఏటీఎంల వద్ద జనాల వరుస కడుతున్నారు. సామాన్యులు, బ్యాంకు సిబ్బంది ఇబ్బందులు వర్ణనాతీతం. అయినప్పటికీ ప్రజలు ఓ మంచి జరిగిందని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు.
రూ.500, రూ.1000 నోట్ల డిపాజిట్తో బ్యాంకులలో ధనం వెల్లువెత్తుతోంది. దేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థ పురోగమించేందుకు మోడీ నిర్ణయం ఉపకరిస్తోంది. భారీ మొత్తంలో బ్యాంకులలో డిపాజిట్లు రావడం గమనార్హం. వారం రోజుల్లో దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులలో వారంరోజుల వ్యవధిలోనే మూడు లక్షల డెబ్బై అయిదు వేల కోట్ల రూపాయలు డిపాజిట్ల రూపంలో జమయ్యాయి.
పాతనోట్లను మార్చడానికి తుది గడువైన నవంబర్ 24 లోపు దాదాపు 10 లక్షల కోట్లు బ్యాంకులలో డిపాజిట్ అయ్యే అవకాశముందని కేంద్రం అంచనా వేస్తోంది. ఆసుపత్రులు, పెట్రోల్ పంపులు, ఇతర సేవల వద్ద పాతనోట్ల మినహాయింపును కూడా కలిపితే 12 లక్షల కోట్ల డిపాజిట్లు పెరగవచ్చని భావిస్తున్నారు.
పెద్ద నోట్ల రద్దు ప్రకటన సమయంలో 16.6 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకులలో చేరుతుందని అంచనా వేసింది. కానీ ప్రభుత్వ అంచనాలు అందుకునే అవకాశాలు తక్కువగా ఉన్నాయని అంటున్నారు. 2016 మార్చి నాటికి 16.6 లక్షల కోట్ల రూపాయలు డిపాజిట్ల రూపంలో బ్యాంకులలో డిపాజిట్ అవుతాయని ఆర్బీఐ అంచానా వేసింది.