పెద్దనోట్ల రద్దు: ఆ ఒక్క రాత్రే 15టన్నుల గోల్డ్ అమ్మేశారు!
నల్లధనం, నకిలీ కరెర్సీని నిర్మూలించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ నోట్ల రద్దు నిర్ణయాన్ని నవంబరు 8వ తేదీ రాత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, అదే రోజు రాత్రి దేశవ్యాప్తంగా ఏకంగా 15 టన్నుల బంగారం అమ్ముడుపోయిందని భారత బంగారం, ఆభరణ వర్తకుల సంఘం (ఐబీజేఏ) అధికారులు తెలిపారు.
సాధారణంగా ఓ నెలలో అమ్ముడుపోయే బంగారంలో ఇది 20 శాతం కావడం విశేషం. దీని విలువ దాదాపు రూ.5వేల కోట్లు ఉంటుంది. ఇక ఆ రోజు రాత్రి దేశంలో ఉన్న ఆరు లక్షల బంగారు వ్యాపారుల్లో 1800 మంది నిబంధనలను ఉల్లంఘించి పాత నోట్లకు విక్రయాలు జరిపారని ఐబీజేఏ అధికారులు పేర్కొన్నారు. వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.
ఇది ఇలా ఉండగా, అనుమానాస్పద వ్యాపారుల నుంచి నవంబరు 7 నుంచి 11 వరకు సాగించిన అమ్మకాల వివరాలను తెప్పించుకుని కేంద్ర ఎక్సైజ్ నిఘా విభాగం పరిశీలిస్తోంది. సాధారణంగా దేశంలో ఏటా సరాసరి 800 టన్నుల అమ్మకాలు జరుగుతాయి. అయితే నోట్ల రద్దు నేపథ్యంలో 500 టన్నులు కూడా మించకపోవడం గమనార్హం.