డెంగ్యూ రోగికి బత్తాయి ట్రీట్మెంట్...వికటించిన వైద్యం-అసలేమైందంటే..?
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్ లో ఒక షాకింగ్ ఘటన జరిగింది. ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో డెంగ్యూ రోగికి రక్తంలోని ప్లేట్లెట్లకు బదులు బత్తాయి పండ్ల రసాన్ని ఎక్కించారన్న ఆరోపణలపై ప్రభుత్వం కఠిన చర్యలకు ఆదేశించింది. ప్లేట్లెట్ల కు బదులు బత్తాయి పండ్ల రసాన్ని ఎక్కించడం తో రోగి మృతి చెందిన సంఘటన ప్రయాగ్ రాజ్ లో చోటుచేసుకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే..
రోగికి ప్లేట్ లెట్ లకు బదులు బత్తాయి రసం?
అక్టోబర్ 17వ తేదిన ప్రదీప్ పాండే అనే వ్యక్తి డెంగ్యూ తో బాధపడుతూ ప్రయాగ్రాజ్ లోని ఈ ప్రాంతంలో ఉన్న గ్లోబల్ హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు. అతనికి ప్లేట్లెట్లు ఎక్కించాలి అని వైద్యులు చెప్పడంతో సమీపంలో ఉన్న బ్లడ్ బ్యాంకులో ప్లేట్లెట్ల కోసం సంప్రదించారు. దీంతో బ్లడ్ బ్యాంక్ సిబ్బంది ప్లాస్మా బ్యాగ్ అని వారికి ఒక బ్యాగ్ ఇచ్చారు. దానిని రోగి బంధువులు డాక్టర్ కి తీసుకువెళ్లి ఇవ్వడంతో, డాక్టర్లు దానిని పరిశీలించకుండానే ప్లాస్మా గా భావించి రోగికి ఎక్కించారు. దీంతో ప్రదీప్ పాండే మృతి చెందారు.
మరణించిన డెంగ్యూ బాధితుడు .. బత్తాయి రసం ఎక్కించారని బంధువుల ఆందోళన
అయితే బ్లడ్ బ్యాంక్ నుండి తీసుకువచ్చిన బ్యాగులలో ఒక బ్యాగ్ ప్లాస్మా ఎక్కించిన తర్వాత అతని పరిస్థితి క్షీణించిందని రోగి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రోగి ఆరోగ్యం క్షీణించడంతో అతని మరో ఆసుపత్రికి తరలించామని, అక్కడ అతను మృతి చెందినట్లుగా వైద్యులు ధ్రువీకరించారు అని తెలిపారు. రోగిని తీసుకువెళ్ళిన రెండో ఆసుపత్రి వైద్యులు రోగికి ఎక్కించిన ప్లేట్లెట్ బ్యాగ్ నకిలీదని చెప్పడంతో ఆ బ్యాగ్ లో బత్తాయి రసం ఉందంటూ రోగి బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆసుపత్రి సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని రోగి బంధువులు డిమాండ్ చేశారు.
బత్తాయి రసం బ్యాగ్ వీడియో వైరల్.. స్పందించిన ప్రభుత్వం
మృతుడి బంధువులు ఒకరు బత్తాయి రసం ఉన్న ప్లేట్లెట్ బ్యాగ్ ను చూపించి ఓ వీడియో తీసి దానిని ట్విటర్లో పోస్ట్ చేయడంతో కలకలం రేగింది. దీనిపై డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్ స్పందించారు. ఆయన ఒక ట్వీట్లో, ఆసుపత్రిలో డెంగ్యూ రోగికి ప్లేట్లెట్లకు బదులుగా బత్తాయి రసం ఎక్కించిన వైరల్ వీడియోను గుర్తించి, ఆసుపత్రిని సీజ్ చేసినట్లు వెల్లడించారు. ప్లేట్లెట్ ప్యాకెట్లు పరీక్షకు పంపించామని, దోషులుగా తేలితే ఆసుపత్రిపై కఠిన చర్యలు తీసుకుంటామని పాఠక్ తెలిపారు.
చీఫ్ మెడికల్ ఆఫీసర్ సూచనల మేరకు ఆసుపత్రికి సీల్ వేశామని శాంపిల్ పరీక్షించి నివేదిక వచ్చేవరకు అలాగే ఉంటుందని ప్రయాగ్రాజ్ అదనపు చీఫ్ మెడికల్ ఆఫీసర్ తెలిపారు.ప్రయాగ్రాజ్ జిల్లా కలెక్టర్ సంజయ్ కుమార్ ఖత్రి విచారణ జరుగుతోందని మరియు ప్లేట్లెట్స్ కూడా పరీక్షించబడుతుందని తెలిపారు.
ఆస్పత్రి యాజమాన్యం వివరణ ఇలా
పేషెంట్ల బంధువులే ప్లేట్లెట్స్ బ్యాగ్ లను తీసుకువచ్చారని, ఇందులో తమ ప్రమేయం ఏమీ లేదని ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. రోగి యొక్క ప్లేట్లెట్స్ స్థాయి 17,000 కి పడిపోయిందని, దాని తర్వాత అతని బంధువులు ప్లేట్లెట్స్ ఏర్పాటు చేసినట్లుగా ఆసుపత్రి యాజమాన్యం వెల్లడించింది. పేషెంట్ తరపు బంధువులు ప్రభుత్వ బ్లడ్ బ్యాంక్ నుండి ఐదు యూనిట్ల ప్లేట్లెట్లను తీసుకువచ్చారని, మూడు యూనిట్ల మార్పిడి తర్వాత, రోగి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కాబట్టి తాము వాటిని ఎక్కించటం నిలిపివేశామని ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది.