కర్ణాటకలో మొదటి డిటెన్షన్ సెంటర్..? : ఇవీ దాని చుట్టూ కథనాలు..
దేశంలో అసలు డిటెన్షన్ కేంద్రాలే లేవని ఇటీవల ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఎవరికీ ఎలాంటి అభద్రతా భావం అవసరం లేదని, ఎవరినీ డిటెన్షన్ కేంద్రాలకు తరలించరని చెప్పారు. కానీ కర్ణాటకలో మాత్రం ఇప్పటికే ఓ డిటెన్షన్ కేంద్రం ఏర్పాటైనట్టుగా కథనాలు వస్తున్నాయి. బెంగళూరు శివారులోని సొందెకొప్ప గ్రామంలో డిటెన్షన్ కేంద్రం ఏర్పాటు చేసినట్టుగా సమాచారం. శరణార్థులు,అక్రమ వలసదారులను తరలించేందుకే దాన్ని ఏర్పాటు చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది.
డిటెన్షన్ కేంద్రం ఏర్పాటుపై కర్ణాటక హోంమంత్రి
డిటెన్షన్ కేంద్రం ఏర్పాటుపై జరుగుతున్న ప్రచారంపై కర్ణాటక హోంమంత్రి బసవరాజ్ బొమ్మాయి స్పందించారు. దాన్ని 'డిటెన్షన్ కేంద్రం' అని పేర్కొనడం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. సరిగా చెప్పాలంటే అది డిటెన్షన్ కేంద్రం కాదని,పౌరసత్వం కారణంగా ఎవరినీ నిర్బంధించే ఉద్దేశం తమకు లేదని చెప్పారు.
ఆ ప్రచారాన్ని తోసిపుచ్చిన హోంమంత్రి
డిటెన్షన్ కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్టు జరుగుతున్న ప్రచారాన్ని హోంమంత్రి తోసిపుచ్చారు. కావాలంటే దాని నిర్వహణను పర్యవేక్షిస్తున్న సాంఘీక సంక్షేమ శాఖ
నుంచి వివరాలు కోరవచ్చన్నారు. అక్కడ కార్యకలాపాలు జరుగుతున్నట్టు తనకైతే ఎలాంటి సమాచారం లేదన్నారు. ఒకవేళ నిజంగా అక్కడ డిటెన్షన్ కేంద్రం ఉండి ఉంటే.. ఎవరో ఒకరిని నిర్బంధించి ఉండాలి కదా? అని ఎదురు ప్రశ్నించారు. కానీ అక్కడ ఎవరూ లేరని స్పష్టం చేశారు.
అక్రమంగా నివాసముంటున్న ఆఫ్రికన్లను తరలించడానికే..
హోంమంత్రి బొమ్మాయి చెప్పిన వివరాల ప్రకారం.. వీసా గడువు ముగిసినప్పటికీ భారత్లోనే ఉంటూ మాదక ద్రవ్యాలను విక్రయిస్తున్న ఆఫ్రికన్స్ను తరలించేందుకు అలాంటి ఏర్పాటు ఒకటి చేశారు. అసాంఘీక కార్యకలాపాల వల్ల దేశ శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని.. కాబట్టి డ్రగ్స్ విక్రయించే ఆఫ్రికన్ జాతీయులను గుర్తించి అక్కడికి తరలిస్తామని చెప్పారు. అక్కడి నుంచి నేరుగా వారి దేశాలకు పంపించేస్తామని తెలిపారు.
సెంట్రల్ రిలీఫ్ సెంటర్..
పేరు చెప్పేందుకు ఇష్టపడని ఓ సాంఘీక సంక్షేమ శాఖ అధికారి వెల్లడించిన వివరాల ప్రకారం వచ్చే ఏడాది జనవరి 1 లోపు 'సెంట్రల్ రిలీఫ్ సెంటర్' ఒకటి ఏర్పాటు చేయాల్సిందిగా వారికి మార్గదర్శకాలు అందాయి. తదనుగుణంగానే అక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. గతంలో దాదాపు 18 ఏళ్లకు పైగా ఆ భవనాన్ని సాంఘీక సంక్షేమ హాస్టల్ కోసం వాడినట్టు చెప్పారు. గత రెండేళ్లుగా అది ఖాళీగానే ఉన్నట్టు చెప్పారు. ఈ ప్రాజెక్టులో సాంఘీక సంక్షేమ శాఖను భాగం చేయడానికి కారణం.. అక్కడ నిర్భంధించేవారికి తమ శాఖ నుంచే ఆహారం,దుస్తులు,వసతి కల్పించబడుతాయని చెప్పుకొచ్చారు.