కాశీ విశ్వనాథుడి గర్భగుడిలో తన్నుకున్న భక్తులు, సిబ్బంది
కాశీ అన్న పేరే పరమ పవిత్రం. అటువంటిది ఆ దేవాలయం పవిత్రతను ఎవరూ తెలుసుకోలేరు. ప్రతి మనిషి తన చివరి మజిలీ కాశీలో ముగియాలని కోరుకుంటారు. అంతటి ఆలయంలో అహంకారంతో ఒకరినొకరు తన్నుకున్నారు. చిన్నగా ప్రారంభమైన వాగ్వాదం చివరకు కొట్టుకునే వరకు వెళ్లింది. భగవంతుడి ముందే గొడవకు దిగ దర్శనానికి వచ్చిన పవిత్రతను పోగొట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
సాయంత్రం గర్భగుడిలో శివుడికి పూజారులు హారతి ఇస్తున్నారు. హారతి ఇచ్చే సమయంలో తలుపులు మూసేస్తారు. సిబ్బంది మూసివేయబోతున్న తరుణంలో ఇద్దరు భక్తలు వారితో తమకు దర్శనం కావాలని పట్టుబట్టారు. వాగ్వాదానికి దిగారు. సిబ్బంది ఎంత చెబుతున్నా వినిపించుకోకుండా దురుసుగా ప్రవర్తించి లోపలకు తోసుకువచ్చారు. మాటా మాటా పెరిగి ఆలయ సిబ్బంది, ఇద్దరు భక్తులు గర్భగుడిలోనే తోసుకున్నారు. అదే చిలికి చిలికి గలివానలా మారి కొట్టుకున్నారు. ఈ సంఘటన అనంతరం ఆలయ సిబ్బంది నిర్వాహకులకు లేఖ రాశారు. తమకు పోలీసులు సహకరించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన జరగడానికి ముందే కొద్దిరోజుల క్రితం కాశీలో దర్శనం విషయంలో గొడవ జరిగిన సంగతి తెలిసిందే. ఇది మరువక ముందే మరో ఘటన చోటుచేసుకోవడంపై భక్తులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
వారణాసి ఆలయంలో పరమ శివుడికి హారతిచ్చే సమయంలో తలుపులు మూయడం పరిపాటి. ఆ సమయంలో భక్తులు హారతి అయిపోయేవరకు ఎదురు చూస్తారు. కానీ కొందరు భక్తులు ఇలా దుందుడుకుగా వ్యవహరిస్తుండటం పరిపాటిగా మారిందని, ఎన్నిసార్లు నిర్వాహకుల దృష్టికి విషయాన్ని తీసుకువెళ్లినప్పటికీ శాశ్వత పరిష్కారం మాత్రం దొరకడంలేదని ఆలయ సిబ్బంది వెల్లడించారు. దీనివల్ దేవాలయం పవిత్రత దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు.