అంతర్జాతీయ విమానాల సర్వీసులపై నిషేధం ఏప్రిల్ 30 వరకు కొనసాగింపు
న్యూఢిల్లీ: దేశంలో మరోసారి కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధాన్ని మరోసారి పొడిగించింది. ప్రస్తుతం అంతర్జాతీయ వాణిజ్య విమాన సర్వీసులపై కొనసాగుతున్న ఈ నిసేధాన్ని ఏప్రిల్ 30 వరకు పొడిగిస్తున్నట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ అవియేషన్(డీజీసీఏ) వెల్లడించింది.
అయితే, కార్గో సర్వీసులకు ఇది వర్తించదని డీజీసీఏ జాయింట్ డైరెక్టర్ జనరల్ సునీల్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే డీజీసీఏ ఎంపిక చేసిన దేశాలకు మాత్రం విమానాలు నడుస్తాయని స్పష్టం చేశారు.
గత సంవత్సరం కరోనా మహమ్మారి తొలిసారి విజృంభిస్తున్న సమయంలో మార్చి 23న అంతర్జాతీయ విమానా సర్వీసులపై భారత్ నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నిషేధాన్ని పలుమార్లు పొడిగిస్తూ వస్తున్నారు. ఎయిర్ బబుల్ పేరిట ఎంపిక చేసిన దేశాలకు గత జులై నుంచి విమాన సర్వీసులను నడిపిస్తోంది. యూఎస్, యూకేతోపాటు 20 దేశాలకు ఈ సర్వీసులు కొనసాగుతున్నాయి.
ఇప్పుడు మళ్లీ దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న దృష్ట్యా అంతర్జాతీయ విమాన సర్వీసుల నిషేధాన్ని పొడిగించింది. కాగా, కోవిడ్ -19 వైరస్ యుకె, బ్రెజిల్, దక్షిణాఫ్రికా వేరియంట్లలో రోగులు సంక్రమించిన 795 కేసులను ఇప్పటివరకు భారతదేశంలో గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
కాగా, దేశ వ్యాప్తంగానూ కరోనా కేసుల్లో ఉధృతి కొనసాగుతున్నప్పటికీ.. సోమవారం కాస్త కేసులు తగ్గాయి. సోమవారం ఆదివారం 46,951 కొత్త కేసులు నమోదు కాగా, సోమవారం 40,715 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,16,86,796కి చేరింది. కొత్తగా 29,785 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 1.11 కోట్లకుపైబడింది. గత 24 గంటల్లో 199 మంది మరణించగా, మొత్తం మరణాల సంఖ్య 1.6లక్షలకి చేరింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 3,45,377 యాక్టివ్ కేసులున్నాయి. కాగా, ఒక్క మహారాష్ట్రలోనే 2 లక్షలకుపైగా యాక్టివ్ కేసులు ఉండటం గమనార్హం. ఇక మరోవైపు దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగంగా కొనసాగుతోంది. గత 24 గంటల్లో 32,53,095 లక్షల మందికి వ్యాక్సిన్ డోసులు వేశారు. దీంతో ఇప్పటి వరకు వ్యాక్సిన్ తీసుకున్నవారి సంఖ్య 4,84,94,594కి చేరింది.