పంజాబ్: మూడోవంతు దళితులే.. ప్రాతినిధ్యమే కనిష్టం
మాల్వార్ రీజియన్లో భూమి గల దళితులకు, జాట్ సిక్కుల మధ్య నెలకొన్న వివాదం అగ్నిగుండంగా మారుతున్నది. ఆరెకరాల భూమి గల బల్వీందర్ సింగ్ తమ మాట వినలేదని జాట్లు మూకుమ్మడిగా అతడి ఇంటిపై దాడి చేశారు.
జలంధర్/ చండీగఢ్: గుర్కాన్వల్ భారతి మిగతా పిల్లల మాదిరిగానే టీనేజ్ అమ్మాయి. ఒక కళాశాల విద్యార్థినిగా ఆమె తన ఆదర్శమైన సినీ గాయకులు పాడిన పాటలు హమ్ చేస్తూ భవిష్యత్లో బాలీవుడ్లో చేరిపోవాలని కలలు కంటున్నది. గిన్నీ మాహీ వంటి ప్రముఖ పంజాబీ సినీ గాయకురాలు వేల మంది పంజాబీలకు స్ఫూర్తి ప్రదాత.
ఆమెకు బాబా సాహెబ్, రవిదాస్ జీ వంటి వారు ఆదర్శం. అవకాశం వస్తే సమానత్వం, న్యాయంపై తమకు గల విప్లవాత్మక భావాలను పాటల రూపంలో ప్రజలకు వినిపించాలని గుర్కాన్వల్ వంటి వారు తలపోస్తున్నారు. కానీ గుర్కాన్వల్ వంటి టీనేజ్ దళిత యువతి బాలీవుడ్లో అడుగు పెట్టాలంటే మద్దతు పలికే వారు కావాలి. రాజ్యాంగం ఎన్నిహక్కులు కల్పించినా సమాజంలో అట్టడుగు వర్గాలైన దళితులంటే ప్రతి ఒక్కరికీ అలుసే.
మాల్వార్ రీజియన్లో భూమి గల దళితులకు, జాట్ సిక్కుల మధ్య నెలకొన్న వివాదం అగ్నిగుండంగా మారుతున్నది. ఆరెకరాల భూమి గల బల్వీందర్ సింగ్ తమ మాట వినలేదని జాట్లు మూకుమ్మడిగా అతడి ఇంటిపై దాడి చేశారు. బల్వీందర్ సింగ్ కాళ్లు తీసేశారు. తన కాళ్లు తీసేయడానికి బదులు ప్రాణాలే తీసేయండని మొరబెట్టుకున్నా ఆగంతకులు వినలేదు. దీనిపై పోలీసులు ఫిర్యాదు స్వీకరించేందుకు ముందుకు రాలేదు. జాట్లతో పోలీసులు కుమ్మక్కయ్యారన్న విమర్శలు ఉన్నాయి.
మూడు శాతం భూభాగం ఉన్నా దళితులంటే మంటే
మాల్వా రీజియన్లో కేవలం 51 ఎకరాల భూమిపై హక్కు కలిగి ఉన్న దళిత రైతులపై గత నాలుగేళ్లుగా అగ్రవర్ణాల ఆగడాలు, అక్రుత్యాలు చెప్పనలవి కాదంటే అతిశేయోక్తి కాదు. పంజాబ్ జనాభాలో దళితుల జనాభా 32 శాతం. భారతదేశంలోని ఇతర రాష్ట్రాల్లోని దళితుల జనాభాతో పోలిస్తే అత్యధికం.
కానీ చట్టసభల్లో మాత్రం దళితుల ప్రాతినిథ్యం చాలా స్వల్పం. మరో ఆసక్తికరమైన అంశమేమిటంటే వారి ఆధీనంలో ఉన్నది కేవలం మూడు శాతం పంట భూమి మాత్రమే. దాన్ని కూడా కాజేసేందుకు అగ్రవర్ణాలు వెనుకంజ వేయడం లేదు. ఝాలూర్ ప్రాంతం రైతుల శాంతియుత ఆందోళనలకు కేంద్రస్థానం. దళితుల భూములు కొనుగోలు చేసేందుకు అగ్రవర్ణాలు కొందరు నకిలీ వాల్మికీలను తెరపైకి తేవడం పట్ల దళితులు ఆగ్రహిస్తున్నారు.
ఇందుకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగడం తమకు గర్వకారణం కావడంతోపాటు తమ జీవనం, తమ వారసుల భవిష్యత్కు సంబంధించిన అంశమని ధీమాగా చెప్తున్నారని జమీన్ ప్రాప్తి సంఘర్ష్ కమిటీ సభ్యుడు బల్వీందర్ సింగ్ చెప్పాడు. ఈ పరిస్థితి దాదాపుగా పంజాబ్ రాష్ట్రమంతా విస్తరించి ఉన్నదని చెప్తున్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వారు చవి చూసిన అనుభవాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఏ రాజకీయ పార్టీనీ కూడా విశ్వాసంలోకి తీసుకోవడానికి సిద్ధంగా లేరు.
1920 నుంచే పంజాబ్ లో కుల వివక్ష వ్యతిరేక చరిత్ర
పంజాబ్ రాష్ట్రంలో కుల వ్యతిరేక ఆందోళనకు గొప్ప చరిత్రే ఉంది. 1920వ దశకం నుంచి కుల వివక్షకు వ్యతిరేకంగా మంగూ రాం ముగోవలియా ఆధ్వర్యంలో పంజాబీ దళితులు ఉద్యమించిన కాలం అది. దళితులను అడ్ ధర్మీలుగా పిలువాలంటారాయన. కానీ పాలక వర్గాలు మాత్రం దళితులకు నాయకత్వం వహించిన వారిని శక్తిహీనులుగా చేయడంలో అగ్రవర్ణాలు ముందు వరుసలో నిలుస్తాయి. అన్ని పార్టీలదీ అదే వరుస. దళితులు, అగ్రవర్ణాలకు వేర్వేరుగా గురుద్వారా లు ఉండటం గమనార్హం.
1966 నుంచి కాంగ్రెస్ కు అండ.. 1980 తర్వాత దూరమైన దళితులు
1966లో పంజాబ్ ఆవిర్భవించినప్పటి నుంచి దళితులు దశాబ్దాల తరబడి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచారు. వారిలో అత్యధికులు ప్రాథమికంగా చామర్లుగా, వాల్మికిలుగా, ఇతర ఉప కులాల వారీగా ఉన్నారు. అయితే 1980వ దశకంలో మిలిటెంట్ ఉద్యమాలు వెల్లువెత్తడంతో పరిస్థితి తారుమారైంది.
కాంగ్రెస్ పార్టీ పలువురు దళిత నేతలను ముందు వరుసలో నిలిపినా ప్రజా నాయకులుగా నిలబడలేకపోయారు. 2007, 2012 ఎన్నికల్లో దోబా రీజియన్లో కాంగ్రెస్ పార్టీ కనుమరుగైంది. అకాలీలు కుల వ్యతిరేక గురు గ్రంథ్ సాహిబ్ తోనే ప్రమాణం స్వీకరిస్తారు. కానీ తమకు తక్కువ అధికారాలు కల్పిస్తారని దళితులు అంటున్నారు.
ఆమ్ఆద్మీ పార్టీపై దళితుల ఆశలు
అయితే ప్రస్తుతం కాంగ్రెస్, బిజెపిలకు ప్రత్యామ్నాయంగా ముందుకు వచ్చిన ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) ఈ అంతరాయాన్ని పూడ్చివేస్తుందని ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. 2014 లోక్ సభ ఎన్నికల్లో నాలుగు లోక్ సభస్థానాలను ఆప్ పార్టీ గెలుచుకోవడమే దీనికి నిదర్శనమంటారు. అంతే కాదు ఆప్ అధికారంలోకి వస్తే దళితులకు డిప్యూటీ సీఎం పదవి అప్పగిస్తామని ఆ పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హామీనివ్వడం ఇతర ప్రధాన రాజకీయ పార్టీలకు మంటగా ఉన్నది.
ఢిల్లీలో దళితుడ్ని ఎందుకు సీఎంను చేయలేదని కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి జోగిందర్ మన్న్ ప్రశ్నించారు. రెండేళ్ల క్రితమే పుట్టిన తమ పార్టీని ఎందుకు లక్ష్యంగా పెట్టుకుంటారంటూ ఆప్ నేత చందన్ గ్రెవాల్ ఫక్కున నవ్వేశారు. బిజెపి నేత సోం ప్రకాశ్ స్పందిస్తూ దళితులకు రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకుగా ఉపయోగించుకున్నాయే గానీ వారికి లబ్ధి చేకూర్చలేదంటున్నారు. వారికి విద్యా ఉపాధి కల్పించనందు వల్లే సంగ్రూర్ లోని దళితులు బహిష్కరణ నిర్ణయం తీసుకున్నారని చెప్తున్నారు.
దళితులకో పార్టీ కావాలి
జలంధర్ లెదర్ బెల్టులో స్లీవెన్ క్లెయిర్ కోట్ల రూపాయల తోళ్ల వ్యాపారంచేస్తారు. ఆయన సోదరుడు, అకాలీదళ్ ఎమ్మెల్యే క్లెయిర్ మాత్రం దళితుల సమస్యలను పట్టించుకునేందుకు ఒక పార్టీ కావాలని చెప్తారు. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ తాయిలాలు చూపి ప్రలోభ పెట్టి ఓట్లు పొంది తర్వాత మరిచిపోతారని పేర్కొన్నారు.
ప్రభావం చూపని బిఎస్పీ
రాష్ట్ర జనాభాలో మూడోవంతు దళితులు ఉన్న పంజాబ్ అసెంబ్లీలో దళితులకు ప్రాతినిధ్యం వహిస్తున్న బహుజన్ సమాజ్ వాదీ పార్టీ (బిఎస్పీ) తరుఫున ఎమ్మెల్యేలే లేరు. 2002 తర్వాత క్రమంగా బిఎస్పీ సగటు ఓటు శాతం ఐదుకు పడిపోవడమే కాదు ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరాం మరణించిన తర్వాత పార్టీకి నాయకత్వ కొరత ఏర్పడిందని చెప్పారు.
పార్టీకి రాష్ట్రంలో నేతలు ఉన్నా అధినాయకత్వం ఉత్తరప్రదేశ్లో ఉండటమే తమ సమస్యగా మారిందంటున్నారు. కానీ పంజాబ్ రాష్ట్ర రాజకీయాల్లో కొత్తగా ప్రవేశించిన ఆప్ వల్ల తమ జీవితాల్లో ఏదైనా కొత్తదనం వస్తుందేమోనని ఆశిస్తున్నారు. కాన్షీరాం హయాంలో 1992లో పంజాబ్ అసెంబ్లీలో బీఎస్పీకి తొమ్మిది మంది దళిత ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ ఈనాడు పట్టించుకునే వారే లేక దళితులు అన్ని రంగాల్లో అణచివేయబడుతున్నారు.
రాష్ట్రంలోని 10 వేల డేరాల నిర్వాహకులు తరుచుగా తమ ఓట్లను, రాజకీయ నేతల తల రాతలను నిర్దేశిస్తున్నారని స్థానిక దళితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరాం వారసత్వాన్ని అందుకున్న మాయావతి ఆయన స్థాయిలో ప్రతిభావంతమైన రాజకీయాలు చేయడం లేదని చెప్తున్నారు.