సద్దాం హుస్సేన్,గడాఫీ లాంటి నియంతలు కూడా ఎన్నికల్లో గెలిచినవాళ్లే... బీజేపీకి రాహుల్ కౌంటర్...
ఎన్నికల ప్రజాస్వామ్యంలో తిరుగులేని విజయాలను నమోదు చేసి రెండుసార్లు అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ సర్కార్... భవిష్యత్తులోనూ ఇదే విజయ పరంపర కొనసాగుతుందన్న ధీమాతో ఉంది. అయితే బీజేపీ పాలనలో దేశంలో ప్రజాస్వామ్యం సన్నగిల్లుతోందని కాంగ్రెస్ విమర్శిస్తోంది. అంతేకాదు,ఇరాక్ నియంత సద్దాం హుస్సేన్,లిబియా నియంత గడాఫీ సైతం ఎన్నికల్లో విజయాలు సాధించినవారేనని గుర్తుచేస్తోంది. బ్రౌన్ యూనివర్సిటీకి చెందిన అశుతోష్ వర్ష్నే,విద్యార్థులతో వర్చువల్గా జరిగిన సమావేశంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు.
'సద్దాం హుస్సేన్,గడాఫీ కూడా ఎన్నికల్లో గెలుపొందినవారే. ఎన్నికలంటే ప్రజలు ఓటింగ్ మెషీన్పై బటన్ నొక్కడం కాదు. ఎన్నికలంటే ఒక నెరేటివ్... ఎన్నికలంటే దేశంలోని వ్యవస్థలన్నీ సరిగ్గా పనిచేస్తున్నాయని నిర్దారించడం... న్యాయ వ్యవస్థ పారదర్శకంగా వ్యవహరించడం... పార్లమెంటులో చర్చలు... కాబట్టి ఓటు లెక్కింపుకు ఈ విషయాలన్నీ అవసరం.' అని రాహుల్ పేర్కొన్నారు. భారత్లో ప్రజాస్వామ్య విలువలు రోజురోజుకు పడిపోతున్నాయని... దానిపై ప్రత్యేకించి స్టాంప్ వేయాల్సిన పని లేదని అన్నారు. ఇటీవల స్వీడన్కి చెందిన వీ డెమ్ ఇన్స్టిట్యూట్ భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం నుంచి ఎన్నికల నిరశంకుత్వం వైపు మళ్లుతోందని తమ రిపోర్టులో వెల్లడించిన నేపథ్యంలో రాహుల్ ఈ కామెంట్స్ చేశారు.
పార్లమెంటు చర్చల సందర్భంగా ఓసారి తన మైక్ ఆఫ్ చేసి మాట్లాడే అవకాశం లేకుండా చేశారని రాహుల్ వాపోయారు. దాన్ని టీవీల్లో కూడా ప్రసారం చేయలేదన్నారు. 'పార్లమెంటులో బీజేపీ నేతలు నాతో చెప్తుంటారు... సభలో బహిరంగ చర్చలు చేయలేమని. తాము చెప్పాలనుకుంటున్నారో అది మాత్రమే చెప్తారు.. ఇతరులకు చర్చించేందుకు అవకాశం ఇవ్వరు.' అని పేర్కొన్నారు. చైనా గ్లోబల్ సూపర్ పవర్గా ఎదుతుండటాన్ని ప్రస్తావిస్తూ... ఆ దేశానికి మిలటరీ స్ట్రాటజీ ఉందని,కానీ దానికి కౌంటర్ స్ట్రాటజీ మనవైపు నుంచి లేదని అన్నారు.
కాగా, ప్రధాని నరేంద్ర మోదీ 2014లో దేశంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశంలో ప్రజాస్వామ్య స్వేచ్చ తగ్గుతోందని వీ డెమ్ ఇన్స్టిట్యూట్ రిపోర్టులో వెల్లడైన సంగతి తెలిసిందే. అంతకుముందు,ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఈఐయూ) ప్రకటించిన ప్రజాస్వామ్య సూచీలో భారత ర్యాంకు 53కి పడిపోయింది. ప్రజాస్వామ్య సూచీలో 2019లో 6.9 స్కోరుతో ఉన్న ఇండియా, 2020లో 6.61 పాయింట్లకు పడిపోయింది. అయితే ప్రభుత్వ వర్గాలు మాత్రం ఈ రిపోర్టును తప్పు పట్టాయి. దేశంలో ప్రజాస్వామ్యం ఫరిడవిల్లుతోందని చెబుతున్నాయి.