ఆర్బీఐ గవర్నర్ అందుకే రాజీనామా చేసారా..? ఇవే షాకింగ్ వాస్తవాలు..!!
హైదరాబాద్ : దేశం మొత్తం ఐదు రాష్ట్రాల ఎన్నికల మీద ద్రుష్టి సారించింది. ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందోనని ఉత్కంఠగా ఎదురుచూస్తున్న తరుణంలో రిసర్వ్ బ్యాంక్ గవర్నర్ రాజీనామా బాంబ్ పేల్చారు. ఉన్నట్టుండి అంత అకస్మాత్తుగా ఆయన ఎందుకు రాజీనామా చేయాల్సివచ్చిందని దేశ ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ కూడా జరిగింది. ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ తన పదవికి రాజీనామా చేయటం దేశ ఆర్ధిక రంగానికి ఓ కుదుపు లాంటిదని చెప్పుకోవచ్చు. అయితే అసలు ఉర్జిత్ రాజీనామా చేయాల్సిన పరిస్థితులు ఎందుకొచ్చాయనే కోణంలో పరిశీలిస్తే, ఆర్బీఐ స్వయం ప్రతిప్రతిపత్తిని అడ్డుకుంటూ బీజేపీ చేసిన కుట్రలే అసలు కారణాలంటున్నారు ఆర్ధిక విశ్లేషకులు. దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా పలు అంశాలపై చర్చను కోరుతూ మోడీ ప్రభుత్వం ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 7 అధికారాలను ప్రయోగించింది.
ఆర్బీఐ గవర్నర్ రాజీనామా..! కేంద్రం ఒత్తిళ్లే కారణమా..?
ఆర్బీఐ స్వయంప్రతపత్తికి భంగం కలిగించే ఈ పరిణామం కారణంగా ఆర్బీఐ గవర్నర్ తన పదవికి రాజీనామా చేయవచ్చని గత కొద్ది రోజుల నుంచే మార్కెట్లో ఊహాగానాలు నెలకొన్నాయి. ఇటీవల ఆ ఊహలే నిజమయ్యాయి.అంతకుముందు రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్గా సేవలందించిన ఉర్జిత్ పటేల్.. 2016 సెప్టెంబర్ 5న.. ఆర్బీఐ 24వ గవర్నర్గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆర్బీఐ గవర్నర్ కాల పరిమితి 3 సంవత్సరాలు కాబట్టి.. ఆయనకు పదవి ముగియడానికి ఇంకా 8 నెలల సమయముంది. కానీ ఉర్జిత్ ఇప్పుడే రాజీనామా చేయటం పలు చర్చలకు దారితీస్తోంది. అయితే ఉర్జిత్ మాత్రం.. తన వ్యక్తిగత కారణాల రీత్యానే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
వ్యక్తి గత కారణాలతోనే రాజీనామా..! కాని కారణం వేరే అంటున్న ఆర్థిక విశ్లేషకులు..!!
‘‘వ్యక్తిగత కారణాల రీత్యా ఆర్బీఐ గవర్నర్ పదవి నుంచి తక్షణమే తప్పుకోవాలని నిర్ణయించుకున్నా. గడిచిన కొన్నేళ్లలో ఆర్బీఐకి పలు హోదాల్లో సేవలందించే అవకాశం లభించడం గౌరవంగా భావిస్తున్నా. ఈ మధ్యకాలంలో రిజర్వ్ బ్యాంక్ సాధించిన విజయాలు.. సంస్థ సిబ్బంది, అధికారులు, యాజమాన్యం కృషి, మద్దతుతోనే సాధ్యమయ్యాయి. ఈ సందర్భంగా వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా'' అని లేఖ ద్వారా ఆయన పేర్కొన్నారు.
కేంద్ర ఆర్థిక శాఖ నుంచి ప్రెషర్..! తట్టుకోలేకనే తప్పుకున్న ఊర్జిత్..!!
అయితే ఇటీవల జరిగిన బీజీపీ వ్యతిరేక పార్టీల సమావేశంలో ఉర్జిత్ రాజీనామా విషయమై పలు చర్చలు వినిపించాయి. ఆర్బీఐ వద్ద ఉన్న 3.50 లక్షల కోట్ల నిధులను ప్రభుత్వానికి మళ్లించాలంటూ గవర్నర్ ఉర్జిత్ పటేల్పై తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు తెచ్చారని.. అలా చేయలేక, ప్రభుత్వ ఒత్తిళ్లు భరించలేకే ఆయన రాజీనామా చేశారని పలువురు కీలక నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో ఉర్జిత్ రాజీనామా వెనుక బీజీపీ కుట్ర దాగివుందని స్పష్టం అవుతోంది. మరోవైపు ఆర్బీఐ గవర్నర్ రాజీనామా చేశాక శక్తి కాంతా దాస్ ను నూతన గవర్నర్ గా కేంద్రం నియమించిన విషయం తెలిసిందే..!
రాజీనామా వెనక కారణాలెన్నో..! ఆర్థిక వ్యవస్థ గాడిన పడ్డట్టేనా..?
కానీ ప్రస్తుత డిప్యూటీ గవర్నర్ హోదాలో ఉన్న విరాల్ ఆచార్య, ఎన్ఎస్ విశ్వనాథన్ ల వ్యవహారం సందేహాలకు తావిస్తోంది. ఎందుకంటే.. ఆర్బీఐ, కేంద్రం మధ్య రాజుకున్న విభేదాలను వెలుగులోకి తెచ్చింది ఆచార్యనే. అలాంటిది ఈ పరిస్థితుల్లో ఆయన ఎలా ప్రతిస్పందిస్తారనేది ప్రశ్నార్ధకంగా మారింది. ఇక ఎన్ఎస్ విశ్వనాథన్ విషయానికొస్తే.. ఆయన ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాబట్టి ఆయన కూడా కష్టమే! దీంతో.. దీనంతటికీ కారణం అధికార మోదీ ప్రభుత్వమే అని ప్రధాన విమర్శ వినిపిస్తోంది. చూడాలి ఈ వ్యవహారం ఇంకెంత దూరం వెళుతుందో! ప్రస్తుత పరిస్థితులను కొత్త గవర్నర్ ఎలా అదిగమిస్తారన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.