బీజేపీకి 122 సీట్లు: ఐదు దశల ట్రెండ్ ఇదేన్న అమిత్ షా -నందిగ్రామ్లో మమత ఓటమి తథ్యం
కరోనా ఉధృతి నేపథ్యంలో భారీ సభలు వద్దని సూచనలు వస్తున్నా, రాహుల్ గాంధీ లాంటి నేతలు తమ పర్యటనను పూర్తిగా రద్దు చేసుకున్నా, బీజేపీ ఎక్కడా వెనక్కి తగ్గడంలేదు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కమలదళం ఆదివారం కూడా భారీ బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహించింది. పూర్బ బర్దమాన్ ర్యాలీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొన్నారు.
పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ దూసుకుపోతున్నదని, ఇప్పటి వరకు పూర్తయిన ఐదు దశల ఎన్నికల్లో మొత్తం 185 సీట్లకుగానూ 122 సీట్లలో టీఎంసీ కంటే బీజేపీ ముందంజలో ఉందని అమిత్ షా చెప్పారు. బెంగాల్ను విశ్వాస్, వికాస్, వ్యాపార్ దిశగా అభివృద్ధి పథంలో నడిపించేది బీజేపీ మాత్రమేనని ప్రజలు నమ్మబట్టే ఫలితాలు అనుకూలంగా వస్తాయన్నారు.
కరోనా విలయం: ప్రధానికి చెక్ పెడుతూ రాహుల్ గాంధీ కీలక నిర్ణయం -వంచన వద్దన్న ప్రియాంక -మోదీ ఇలా
టీఎంసీ చీఫ్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేవలం ప్రధాని మోదీని ఆడిపోసుకోవడం, భద్రతా బలగాలకు శాపనార్దాలు పెట్టడానికి తన సమయం కేటాయిస్తున్నారని, రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన ఎలాంటి ఎజెండా ఆమె వద్ద లేదని అమిత్ షా మండిపడ్డారు. దీదీ 12 నిమిషాలు మాట్లాడితే, అందులో పది నిమిషాలు మోదీని, తనను విమర్శించడానికి, మరో 2 నిమిషాలు బలగాలను ఆడిపోసుకోవడానికి కేటాయిస్తున్నారని విమర్శించారు.
నాలుగో దశ పోలింగ్ సందర్భంలో కూచ్ బెహార్ హింస పేట్రేగడం, కేంద్ర బలగాల కాల్పుల్లో నలుగురు పౌరులు చనిపోవడాన్ని, మృతదేహాలతో నిరసనలు చేయాలని సీతల్కుచి నియోజకవర్గం అభ్యర్థికి మమతా బెనర్జీ చెబుతున్నట్టు వెలుగుచూసిన ఆడియోలను ప్రస్తావిస్తూ, శవాలతో మమత రాజకీయాలు చేయాలనుకోవడం సిగ్గుచేటన్నారు షా.
గాలి ద్వారా కరోనా :ఆ మాస్కులు వద్దు -ఎన్95 లేదా కేఎన్95 మాస్క్లే రక్ష -అంటు వ్యాధుల నిపుణులు
పశ్చిమబెంగాల్లో ఉంటున్న చొరబాటుదారులు అసలైన బెంగాల్ ప్రజల హక్కులను, ఉద్యోగాలను దోచుకుంటున్నారని, చొరబాటుదారులను రాష్ట్రంలోకి రాకుండా నిరోధించగలిగే సత్తా ఒక్క బీజేపీకే ఉందని అమిత్ షా అన్నారు. బెంగాల్ లో 6వ విడత పోలింగ్ ఈనెల 22న, 7వ విడత 26న, 8వ విడత 29న జరుగనుంది. దీంతో పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. మే 2న ఫలితాలు వెలువడతాయి.