విద్యుత్ స్థంభాన్ని ఢీకొని డీజల్ ట్యాంక్ బూడిద (ఫోటోలు)
మంగళూరు: పెట్రోల్, డీజల్ సరఫరా చేస్తున్న ట్యాంకర్ విద్యుత్ స్థంభాన్ని ఢీకొని బూడిద అయిన సంఘటన కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలోని బెళ్తంగడి సమీపంలో జరిగింది. 12,000 లీటర్ల పెట్రోల్, డీజల్ కాలి బూడిద అయ్యింది. అయితే అదృష్టవశాత్తు స్థానికులు, భక్తులు ప్రాణాలతో బయటపడ్డారు.
బుధవారం సాయంత్రం బెళ్తంగడి సమీపంలోని ల్యాలా బ్రిడ్జ్ దగ్గర వేగంగా వెళుతున్న డీజల్ ట్యాంకర్ టైర్ పేలిపోయింది. ట్యాంకర్ అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్థంభాన్ని డీకొట్టింది. తేరుకున్న ట్యాంకర్ డ్రైవర్, క్లీనర్ అద్దాలు పగలగొట్టుకుని బయటకు వచ్చారు.
ఆ సందర్బంలో ట్యాంకర్ కు మంటలు వ్యాపించాయి. విషయం తెలుసుకున్న పోలీసులు చుట్టుపక్కల మూడు కిలోమీటర్లు దూరంలోనే వాహనాలు నిలిపి వేశారు. స్థానికులు ప్రాణభయంతో పరుగు తీశారు. మూడు గంటల పాటు ఇరు వైపుల వాహన సంచారం నిలిపివేశారు.
మంటలు అదుపు చేశారు
ప్రమాదం జరిగిన వెంటనే నాలుగు ప్రాంతాలలోని అగ్నిమాపక శాఖ అధికారులు పలు వాహనాలతో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చెయ్యడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
పోలీసులకు సమాచారం
ప్రమాదం జరిగిన సమయంలో అటు వైపు కేఎస్ ఆర్ టీసీ బస్సు వెళ్లింది. బస్సు డ్రైవర్ వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.
ఆందోళనలో భక్తులు
ధర్మస్థలం వెలుతున్న శ్రీ మంజునాథ స్వామి భక్తులు ఆందోళనకు గురైనారు. వారి వాహనాలను చాలా దూరంలోనే పోలీసులు నిలిపి వేశారు.
ప్రాణాలు అరచేతిలో
ట్యాంకర్ లో 8 వేల లీటర్ల డీజల్, 4 వేల లీటర్ల పెట్రోల్ ఉంది. ట్యాంకర్ పేలిపోతుందని స్థానికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగు తీశారు.