డిగ్గీ: కిరణ్ లేఖపై చూల్లేదు, మోడీ వారసత్వంపై అందరు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్లకు రాసిన లేఖ పైన, గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యల పైన కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, ఎపి కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ సోమవారం స్పందించారు.
ప్రధాని, రాష్ట్రపతిలకు కిరణ్ రాసిన లేఖను తాను చూడలేదని, చూసిన తర్వాత స్పందిస్తానని దిగ్విజయ్ చెప్పారు. వారసత్వాన్ని బద్దలు కొడదామన్న మోడీ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. అన్ని పార్టీలలోను వారసత్వ రాజకీయాలు కొనసాగుతున్నాయని వివరణ ఇచ్చారు.
కాగా, రాష్ట్ర విభజనపై కేంద్రం ఏకపక్షంగా పోతోందని దీనిపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి నాలుగు రోజుల క్రితం ప్రధాని, రాష్ట్రపతిలకు రాసిన లేఖ కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ లేఖతో పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రిపై ఆగ్రహంతో ఉంది. రెండు రోజుల క్రితం అడిగినప్పుడు కూడా దిగ్విజయ్ ఇదే మాట చెప్పారు. తాను ఇంకా కిరణ్ లేఖను చూడలేదన్నారు.
మరోవైపు ఆదివారం బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నాలో జరిగిన హూంకార్ ర్యాలీలో మోడీ మాట్లాడుతూ... వారసత్వ రాజకీయాలను బద్దలు కొడదామని ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీని ఉద్దేశించి అన్నారు. వారసత్వ రాజకీయాలకు కాంగ్రెస్ అంతం పలికితే తాను రాహుల్ను యువరాజు అని పిలవడం మానేస్తానని చెప్పారు.