మహారాష్ట్ర కొత్త హోంమంత్రి ఆయనే... గవర్నర్కు సమాచారమిచ్చిన సీఎం ఉద్దవ్ థాక్రే...
మహారాష్ట్ర కొత్త హోంమంత్రిగా ఎన్సీపీ నేత దిలీప్ వాల్సే పాటిల్ బాధ్యతలు చేపట్టనున్నారు. హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ రాజీనామాను ఆమోదించిన ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే... రాజీనామా లేఖను గవర్నర్ భగత్ సింగ్ కొషియారీకి పంపించారు. కొత్త హోంమంత్రిగా దిలీప్ వాల్సే బాధ్యతలు చేపడుతారని గవర్నర్కు సమాచారమిచ్చారు.
ప్రతీ నెలా రూ.100కోట్లు వసూలు చేయాలని హోంమంత్రి ఆర్డర్... ముంబై మాజీ పోలీస్ బాస్ సంచలన ఆరోపణలు...
ప్రస్తుతం ఉద్దవ్ కేబినెట్లో దిలీప్ వాల్సే లేబర్ అండ్ ఎక్సైజ్ మంత్రిగా ఉన్నారు. ఇప్పుడాయన హోంమంత్రి పదవి చేపట్టనుండటంతో తన శాఖ బాధ్యతలను డిప్యూటీ సీఎం అజిత్ పవార్కు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
దిలీప్ వాల్సే... ఎన్సీపీ అధినేత శరద్ పవార్ స్నేహితుడు,మాజీ ఎమ్మెల్యే దత్తాత్రయ్ వాల్సే కుమారుడు. శరద్ పవార్కు పీఏగా సందీప్ వాల్సే తన కెరీర్ ప్రారంభించారు. 1990లో మొదటిసారిగా కాంగ్రెస్ టికెట్పై అంబేగావ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. అప్పటినుంచి వరుసగా ఆరుసార్లు అదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం అక్కడినుంచే అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
1999లో దిలీప్ వాల్సే ఎన్సీపీలో చేరారు. ఆ తర్వాత కొద్దిరోజులకే విలాస్ రావు దేశ్ముఖ్ కేబినెట్లో మంత్రిగా చోటు దక్కించుకున్నారు. 2009 నుంచి 2014 వరకూ మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్గా కూడా పనిచేశారు.
కాగా,ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరమ్ వీర్ సింగ్ హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్పై చేసిన అవినీతి ఆరోపణలపై హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నైతిక కారణాలతో దేశ్ముఖ్ తన పదవికి రాజీనామా చేశారు. విచారణ సమయంలో పదవిలో కొనసాగడం ఇష్టం లేదని రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రేకి రాజీనామా లేఖను పంపించగా.. ఆయన దాన్ని ఆమోదించారు.
ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీ నివాసం అంటిల్లా వద్ద పేలుడు పదార్థాలతో కూడిన వాహనం కలకలం రేపిన ఘటన అనేక మలుపులు తిరుగుతూ ఇక్కడిదాకా వచ్చింది. ఈ కేసులో ముంబై క్రైమ్ ఇంటలిజెన్స్ యూనిట్ హోడ్ సచిన్ వాజే అనుమానితుడిగా ఉన్నారు. దీంతో ప్రభుత్వం ఆయనపై వేటు వేసింది. అదే సమయంలో ముంబై పోలీస్ కమిషనర్గా ఉన్న పరమ్ వీర్ సింగ్పై కూడా బదిలీ వేటు వేసింది. అయితే తనపై అకారణంగా వేటు వేశారని పేర్కొంటూ పరమ్ వీర్ సింగ్ సీఎం ఉద్దవ్కు లేఖ రాశారు. అదే లేఖలో హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్పై ఆరోపణలు చేశారు. ప్రతీ నెలా రూ.100కోట్లు వసూలు చేసివ్వాలని సచిన్ వాజేకి అనిల్ దేశ్ముఖ్ టార్గెట్ విధించారని ఆరోపించారు. దీనిపై హైకోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానం సీబీఐ దర్యాప్తుకు ఆదేశించింది.