బస్సులపై ఆకులు: జయలలితకు డిఎంకె లీగల్ నోటీసు
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడిఎంకె అధినేత్రి జయలలితకు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఆధ్వర్యంలోని డిఎంకె లీగల్ నోటీసులు జారీ చేసింది. డిఎంకె జయలలితతో పాటు మరికొందరికి లీగల్ నోటీసులు ఇచ్చింది. అన్నాడిఎంకే అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని డిఎంకె పేర్కొంది.
ఇటీవల కొత్తగా ప్రారంభించిన చిన్న బస్సుల పైన అన్నాడిఎంకె పార్టీ గుర్తు అయిన ఆకులను ముద్రించిందని పేర్కొంది. ఈ విషయమై డిఎంకె ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేసింది. జయలలితతో పాటు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మంత్రి, పలువురు అధికారులకు నోటీసులు జారీ చేశారు.
అధికార పార్టీ ఉప ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తోందని ఎన్నికల సంఘానికి ఇచ్చిన ఫిర్యాదులో డిఎంకె పేర్కొంది. అలాగే అవినీతి నిరోధక శాఖ, డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్లకు కూడా ఫిర్యాదు చేశారు.
జయలలిత ప్రభుత్వం ఇటీవల యాభై చిన్న బస్సులను ప్రారంభించింది. వాటి పైన ఆకులను ముద్రించారు. రెండు ఆకులు అన్నాడిఎంకె పార్టీ గుర్తు. త్వరలో మరో 610 బస్సులను తీసుకు వచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
మరోవైపు బస్సు పైన ఆకుల గుర్తు ఉద్దేశ్య పూర్వకంగా పెట్టలేదని, ఇది ప్రకృతి దృశ్యమని అన్నాడిఎంకె ఎమ్మెల్యే తమిలసరన్ చెప్పారు.