తాను గెలిచినట్టు ప్రచారం చేస్తున్న వారిని నమ్మకండి..! ప్రజాస్వామ్యంలో ఏదైనా జరగొచ్చన్న మోదీ..!!
వారణాసి : భజన చేస్తూ కాలం వెళ్ల దీసే వారికి ప్రధాని మోదీ చురకలంటించారు. తాను ఇప్పటికే గెలిచిన్నట్లు కొంతమంది ప్రచారం చేస్తున్నారని.. ఆ ప్రచార ఉచ్చులో పడొద్దని ప్రధాని మోదీ ప్రజలను కోరారు. భారీ సంఖ్యలో తరలివెళ్లి ఓటింగ్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. వారణాసిలో శుక్రవారం నామినేషన్ వేసిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. మోదీజీ ఇప్పటికే గెలిచేశారని.. ఇక ఓటు వేయకపోయినా ఫరవాలేదు అని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. అలాంటి వారి ఉచ్చులో పడొద్దు. ఓటు మీ హక్కు. ప్రతిఒక్కరూ దాన్ని వినియోగించుకోవాలి. పోలింగ్ రోజు భారీ ఎత్తున తరలి రావాలి అని ప్రజల్ని మోదీ కోరారు. అలాగే గురువారం జరిగిన భారీ రోడ్షోలో ప్రజలు చూపిన ఆదరణకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అంతటి భారీ ర్యాలీ కేవలం వారణాసిలోనే సాధ్యమని అభిప్రాయపడ్డారు. వారి ఆశీర్వాదంతోనే అధికారంలోకి రాగలిగానని వ్యాఖ్యానించారు.

ఉత్తరప్రదేశ్లోని వారణాసి నియోజకవర్గం నుంచి రెండోసారి పోటీ చేస్తున్న మోదీ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఆ సమయంలో ఆయన వెంట ఎన్డీయేపక్ష నేతలు, బీజేపీ సీనియర్ నాయకులు ఉన్నారు. ఈసారి ఆయనను ప్రతిపాదించిన వారిలో ఓ బీజేపీ సీనియర్ నాయకుడితో పాటు ఓ చౌకీదార్, ఓ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, వారణాసి మణికర్ణిక ఘాట్లో దహనసంస్కారాలు నిర్వహించే కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి ఉండడం గమనార్హం. అంతకు ముందు ఆయన కాల భైరవుడి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందరర్భంగా ఎన్డీయేలో సీనియర్ నాయకుడు ప్రకాశ్సింగ్ బాదల్.. మోదీని ప్రశంసల్లో ముంచెత్తారు. తదుపరి ప్రధాని మోదీయే అని.. ఆయనతో ఎవరూ పోటీ పడలేరని అభిప్రాయపడ్డారు.ఈ సందర్భంగా నరేంద్ర మోదీ మీడియాను కూడా ప్రశంసించారు. మండుటెండలో కష్టపడుతున్న వారందరికీ దేవుడు మంచి ఆరోగ్యం ప్రసాదించాలని కోరుకుంటున్నానన్నారు.












Click it and Unblock the Notifications