సుచిత్రా సేన్ చిత్రం: నాడు ఇందిర గాంధీ భయపడ్డారా?
హైదరాబాద్: అలనాటి నటి సుచిత్రా సేన్ శుక్రవారం కన్నుమూసిన విషయం తెలిసిందే. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ కోల్కతాలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సచిత్రా తుది శ్వాస విడిశారు. ఆమె మృతి పట్ల యావద్దేశం సంతాపం ప్రకటించింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతాపం తెలియజేశారు.
కాగా, సుచిత్రా సేన్ ఆంధీ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం విడుదల సమయంలో నాటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ఒకింత భయాందోళనకు గురయ్యారట. గుల్జార్ దర్శకత్వంలో సుచిత్రా సేన్ నటించిన ఆంధీ చిత్రం 1975లో విడుదలయింది. ఈ చిత్రం భారత రాజకీయలపై తీశారు.
ఈ చిత్రం నాటి ప్రధాని ఇందిరా గాంధీ జీవితం ఆధారంగా తీసినట్లుగా అప్పుడు చాలామంది భావించారు. ఈ చిత్రం యొక్క పలు ప్రచార పోస్టర్లలో కూడా 'మీ ప్రధానమంత్రి నిజ జీవితంపై వచ్చిన చిత్రం చూడండి' అని పేర్కొన్నారట. విడుదలకు ముందు అలా ప్రచారం జరగడంతో ఇందిరా గాంధీ ఒకింత భయాందోళనకు గురయ్యారట.
1975లో ఇందిర ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ చిత్రాన్ని 'యథాతథంగా' విడుదల చేసేందుకు అడ్డంకులు కూడా ఏర్పడ్డాయట. ఎమర్జెన్సీ సమయంలో ఈ చిత్రాన్ని బ్యాన్ కూడా చేశారు.
ఆ చిత్రాన్ని చూసిన తర్వాత బ్యాన్ ఎత్తివేసే విషయమై ఆలోచించాలని నాడు ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరా గాంధీ పిఎంవోను ఆదేశించారట కూడా. 1977లో జనతా ప్రభుత్వం వచ్చాక 'యథాతథంగా' చిత్రాన్ని నేషనల్ టెలివిజన్లో వేసేందుకు అనుమతించారట.