రెండు రోజుల శిశువును ఎత్తుకెళ్ళిన శునకాలు.. ఆపై ఒళ్ళు గగుర్పొడిచే దారుణం
హర్యానాలోని పానిపట్లో ఒళ్లు గగుర్పొడిచే సంఘటన ఒకటి చోటు చేసుకుంది. అక్కడ వీధికుక్కలు 2 రోజుల శిశువును ఎత్తుకెళ్లి అత్యంత దారుణంగా పీక్కు తిన్నాయి. హార్ట్ అండ్ మదర్ కేర్ ఆస్పత్రిలోని జనరల్ వార్డులో అందరూ పడుకుని నిద్రపోతున్న రాత్రి సమయంలో పసికందును కుక్కలు తీసుకువెళ్లి చంపేసిన ఘటన చోటు చేసుకుంది.
ఇక ఈ ఘటన వివరాల్లోకి వెళితే జూన్ 25న, షబ్నమ్ అనే గర్భిణి తన బిడ్డకు జన్మనివ్వడానికి ఆసుపత్రిలో చేరింది. అదే రోజు రాత్రి 8:15 గంటలకు మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆమెతో పాటు ఆమె భర్త ఆస్ మహ్మద్ కూడా ఉన్నారు. షబ్నమ్ డెలివరీ తర్వాత ఆసుపత్రి మొదటి అంతస్తులోని జనరల్ వార్డులోనికి షిఫ్ట్ చేశారు ఆసుపత్రి సిబ్బంది . ఆమె గదిలో భర్త, అత్తతో కలిసి ఉంది. షబ్నమ్ మినహా కుటుంబ సభ్యులందరూ రాత్రి గదిలో నేలపై నిద్రిస్తున్నారు . శిశువుకు పాలు త్రాగించిన తర్వాత, అత్త శిశువును నేలపై తన పక్కన పడుకోబెట్టుకుంది.
అర్ధరాత్రి సమయంలో 2:15 గంటలకు కళ్లు తెరిచి చూడగా చుట్టుపక్కల శిశువు కనిపించలేదు. కుటుంబసభ్యులంతా నిద్రలేచి, నవజాత శిశువు ఆచూకీ కోసం ఆస్పత్రిలోని వివిధ ప్రాంతాల్లో వెతికారు. వారు ఆసుపత్రి నుండి బయటకు వెళ్లి వెతకగా వారు శిశువును కుక్కలు పీక్కు తినడం గుర్తించారు. ఆ కుక్కల బారి నుండి శిశువును విడిపించి ఆసుపత్రిలోకి పరుగుతీశారు తల్లిదండ్రులు. అప్పటికే శిశువు మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.
Recommended Video
ప్రస్తుతం ఆసుపత్రి వైద్యులు పసికందు మృతదేహాన్ని శవపరీక్ష కోసం పంపారు . వీధికుక్కలు పసికందును తీసుకు వెళుతున్నాయని కూడా తెలియని ఆసుపత్రి భద్రతను మృతుడి బంధువులు ప్రశ్నించారు. ఆసుపత్రిలో కుక్కల స్వైర విహారం చేస్తున్నా సిబ్బంది ఏం చేస్తున్నారని బాధిత కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. ఆసుపత్రిలోని సిసిటివి ఫుటేజీలో తెల్లవారుజామున 2:07 గంటలకు కుక్క పసికందును తీసుకువెళుతున్నట్లు రికార్డ్ అయ్యింది.