ప్లీజ్.. వైద్యులను వేధించకండి.. సూసైడ్ నోట్లో రాజస్థాన్ డాక్టర్
వైద్యో నారాయణో హరి.. వైద్యులను దేవుళ్లతో పోలుస్తారు. దాదాపు చాలా మంది వృత్తిని దైవంగా భావిస్తారు. అయితే కొందరు నిర్లక్ష్యంగా ఉంటారు. మరికొందరీ వల్ల తప్పిదాలు జరుగుతుంటాయి. అయితే దానికి వారిని బాధ్యులను చేయడం కరెక్ట్ కాదు. అవును రాజస్థాన్లో ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. ఓ రోగి మృతికి వైద్యులు కారణం అని పేషంట్ తరఫు బంధువులు ఆరోపించారు. కేసు కూడా నమోదు కావడంతో ఆందోళన వ్యక్తమయ్యింది.
రాజస్థాన్లో ఓ మహిళా డాక్టర్ రాసిన సూసైడ్ నోట్ చర్చనీయాంశమైంది. ఘటనపై వీధుల్లోకి వచ్చిన డాక్టర్లు రాష్ట్ర పోలీసులపై మండిపడ్డారు. న్యాయం చేయాలని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ హాస్పిటల్లో జరిగిన మృతి పట్ల అర్చన శర్మ అనే డాక్టర్పై హత్య కేసు నమోదుకావడంతో ఆమె తీవ్ర మనస్థాపం చెందారు. దౌసాలో ప్రైవేట్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న మహిళ.. మంగళవారం హేమరేజ్ కారణంగా మృతి చెందింది. ఆ తర్వాత ఆమె తరపు బంధువులు, కుటుంబీకులు కలిసి హాస్పిటల్ బయట ఆందోళన చేశారు. ఫలితంగా డా. అర్చన శర్మ, ఆమె భర్త పేరు మీద మర్డర్ కేసు నమోదైంది.
ఆందోళనలతో పాటు ఆమె పేరు మీద ఎఫ్ఐఆర్ నమోదుకావడంతో అర్చన విస్తుపోయింది. భర్తతో కలిసి హాస్పిటల్ ను నడిపిస్తున్న ఆమె.. సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడింది. అందులో అమాయకపు డాక్టర్లను వేధించొద్దని పేర్కొంది. తన మరణం తర్వాత భర్తను, ఇద్దరు పిల్లలను వేధించొద్దని కోరింది. కేసుపై తగిన చర్య తీసుకుంటామని సీఎం అశోక్ గెహ్లాట్ మాటిచ్చారు. అర్చన శర్మ ఆత్మహత్య బాగా విచారకరం. డాక్టర్లను దేవుళ్లుగా పరిగణిస్తాం. పేషెంట్ల ప్రాణాలు కాపాడటానికి వారి వల్ల అయినంత వరకూ ప్రయత్నిస్తారు. ఏదైనా తప్పు జరిగితే.. డాక్టర్లను నిందించడం కరెక్ట్ కాదని అన్నారు. కేసుపై పూర్తి స్థాయి విచారణ జరపాలని, తగిన చర్యలను కూడా తీసుకోవాలని సీఎం ఆదేశించారు.