2జీ అంటే ఏమిటో నాకు తెలియదు: కరుణానిధి భార్య
సిబిఐ 2జీ విషయంలో ప్రశ్నించడంతో దయాలు అమ్మాళ్ తను గతం మరచిపోయినట్లు తెలియజేసేందుకు కొన్ని ప్రయత్నాలు చేసినట్లు తెలిసింది. దీంతో ఆమెను సిబిఐ అధికారులు తమకు లభించిన ప్రతికూలత కలిగిన సాక్షిగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. తనకు గతం ఏమి జ్ఞాపకం రావడం లేదని దయాలు చెప్పినట్లు సమాచారం.
తనకు 2జీ లేదా సిబిఐ అంటే ఏమిటో తెలియదని దయాలు అమ్మాళ్ తెలిపినట్లు సమాచారం. తను గతంలో కూడా సిబిఐకి ఎలాంటి సమాచారాన్ని ఇవ్వనట్లు ఆమె తెలిపారు. డిఎంకె పార్టీకి ప్రచార సాధనంగా ఉపయోగించే కలైంజర్ టివి గురించి కూడా తనకు ఏమి తెలియదని చెప్పినట్లు సమాచారం. కాగా కరుణానిధి కూతురు కనిమొళితోపాటు దయాలు అమ్మాళ్ కూడా ఆ టివి యజమానుల్లో ఒకరుగా ఉన్నారు.
2008లో టెలికాం శాఖ మంత్రిగా ఉన్న ఎ రాజా అర్హత లేని కంపెనీలకు అనుమతిలిచ్చిన కేసులో(2జీ) అతను జైలు పాలయ్యారు. అయితే ఆ సమయంలోనే రూ. 214 కోట్ల సొమ్మును రాజా నుంచి ఆ ఛానల్ స్వీకరించినట్లు సిబిఐ పేర్కొంటోంది. అయితే దయాలు అమ్మాళ్, కనిమొళి ఇద్దరూ కూడా ఆ ఛానల్ నిర్వహణలో పాలుపంచుకోవడం లేదని చెబుతున్నారు.
కాగా కేసుకు సంబంధముందన్న ఆరోపణలతో జైలు పాలైన కనిమొళి ఆరు నెలల తర్వాత నవంబర్ 2011న బెయిలుపై విడుదలయ్యారు. తనకు కేసుతో ఎలాంటి సంబంధం లేదని, ఏమి తెలియదని, చట్టబద్దం కాని ఎలాంటి కార్యకలాపాలకు తాను పాల్పడలేదని న్యాయమూర్తికి దయాలు అమ్మాళ్ చెప్పినట్లు తెలిసింది. తమ కుటుంబ సభ్యులకు కూడా కేసుతో ఎలాంటి సంబంధం లేదని అమ్మాళ్ చెప్పారు.