ముర్దాబాద్ కాంగ్రెస్ విధానం కాదు : గాంధీ గిరి పెంచుతున్న రాహుల్ గాంధీ
ఒడిషా: గతేడాది పార్లమెంటు సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీని స్థానానికి వెళ్లి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కౌగలించుకున్న సంగతి తెలిసిందే. బీజేపీ వాళ్లు కాంగ్రెస్పై కత్తులు నూరినప్పటికీ బీజేపీ వారంటే తమకు ఎంతో ప్రేమ అని అందుకే ప్రధానిని కౌగలించుకున్నట్లు చెప్పారు రాహుల్ గాంధీ. సీన్ కట్ చేస్తే ఒడిషాలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఓ ర్యాలీలో పాల్గొన్నారు. ఆసమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు మోడీ ముర్దాబాద్ అంటూ నినాదాలు చేశారు. దీంతో కల్పించుకున్న రాహుల్ గాంధీ బీజేపీని ప్రేమతో గెలవాలని ముర్దాబాద్ చెప్పటం సరికాదని సూచించారు. బీజేపీని ప్రేమతో మాత్రమే గెలవాలని అదే కాంగ్రెస్ మంత్రం అని రాహుల్ సూచించారు.
గతేడాది జూన్లో జరిగిన పార్లమెంటు సమావేశాల్లో రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఇలా చెప్పారు. "నన్ను మీరు ద్వేషించొచ్చు. నన్ను పప్పు అని పిలిచినా ఫర్వాలేదు. కానీ నేను మాత్రం మిమ్మలను ప్రేమిస్తాను, గౌరవిస్తాను. ఎందుకంటే నేను కాంగ్రెస్ వాదిని"అని చెప్పి ప్రధాని నరేంద్ర మోడీ దగ్గరకు వెళ్లి రాహుల్ గాంధీ కౌగలించుకున్నారు. ఇక బుధవారం ఒడిషాలో జరిగిన కార్యక్రమంలో రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ పేరు ఎత్తగానే ముర్దాబాద్ అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు నినదించారు. ముర్దాబాద్ అనే మాటలను బీజేపీ ఆర్ఎస్ఎస్ వారు వాడతారని కాంగ్రెస్ వాడకూడదని సూచించారు రాహుల్.
ప్రేమ గౌరవంతోనే బీజేపీని కాంగ్రెస్ ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఓడిస్తుందని చెప్పారు రాహుల్ గాంధీ. ద్వేషంను పక్కనబెట్టి వారిని ప్రేమించడం మొదలు పెడితే కాంగ్రెస్కు గెలుపు సునాయాసమవుతుందని రాహుల్ చెప్పారు. అన్ని వర్గాల వారు నరేంద్ర మోడీని లక్ష్యం చేసుకున్నారని అందుకే ఆయన ముఖంలో భావాలు మారిపోయాయని రాహుల్ అన్నారు. ఒక్కసారి ప్రధాని తన వెనక్కు తిరిగి చూసుకుంటే రాఫెల్, రైతులు, కార్మికులు, మహిళలు ఆయనపై అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. వీరంతా మోడీని ఘెరావ్ చేస్తున్నారని చెప్పారు. దీంతో ఆయన ముఖంలో చికాకు, నైరాశ్యం కనిపిస్తోందన్నారు. ద్వేషం వలన వచ్చింది ఏమీ కాదని... ప్రధాని మోడీని ప్రేమతో ప్రశ్నించామని చెప్పిన రాహుల్ గాంధీ... అదే ప్రేమతో బీజేపీని కూడా ఓడిద్దామని చెప్పారు. ఒడిషాలో కూడా ప్రేమతోనే బిజూ జనతాదళ్ ఓటమికి కృషి చేద్దామని స్పష్టం చేశారు రాహుల్ గాంధీ.