ట్రంప్ మెనూ కాస్త పెద్దదే: టేస్టీ గుజరాతీ ఫుడ్: సమోసా, గ్రీన్ టీ..ఎక్సెట్రా: మల్లఖంగా ప్రదర్శన..!
అహ్మదాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గుజరాతీ శైలి ఆహారాన్ని చూడబోతున్నారు. ఓ పట్టు పట్టబోతున్నారు. గుజరాత్లో సర్వ సాధారణంగా కనిపించే కొన్ని రకాల వంటకాలు, నాలుగైదు రుచుల టీని ఆయన మెనూలో చేర్చారు. డొనాల్డ్ ట్రంప్, ఆయన భార్య మెలానియా ట్రంప్ పర్యటన సందర్భంగా ఆయన వ్యక్తిగతంగా రోజూ స్వీకరించే ఆహారంతో పాటు గుజరాతీ స్టైల్ ఆహారాన్ని అందించబోతున్నారు.
భారత్కు భంగపాటు : చివరి నిమిషంలో చేతులెత్తేసిన అమెరికా.. డీల్స్ లేనట్టేనా?
ఫార్చూన్ ల్యాండ్మార్క్ హోటల్ నుంచి చెఫ్
గుజరాత్లో టాప్ హోటల్స్లో టాప్ ప్లేస్లో ఉన్న ఫార్చూన్ ల్యాండ్మార్క్ హోటల్ చీఫ్ చెఫ్ సురేష్ ఖన్నా సారథ్యంలో ఈ వంటకాలు రూపొందబోతున్నాయి. ట్రంప్, మెలానియా ట్రంప్ కోసం సిద్ధం చేయాల్సిన వంటకాలం కోసం సురేష్ ఖన్నా యాక్షన్లోకి దిగిపోయారు. ఆదివారం రిహార్సల్స్ను నిర్వహించారు. బ్రకోలి కార్న్తో చేసిన సమోసా, ఐస్ టీ, గ్రీన్ టీ, జింజర్ టీ, కొబ్బరి నీళ్లు, మల్టీ గ్రెయిన్తో తయారు చేసిన బిస్కెట్లను ట్రంప్ దంపతులకు స్నాక్స్గా అందించనున్నారు.
సబర్మతి ఆశ్రమంలో కిచెన్..
జాతిపిత మహాత్మాగాంధీకి చెందిన సబర్మతి ఆశ్రమాన్ని ట్రంప్ తన పర్యటన సందర్భంగా సందర్శించనున్న విషయం తెలిసిందే. గుజరాతీ శైలి ఆహారాన్ని ఆయనకు అక్కడే అందిస్తారు. దీనికోసం సురేష్ ఖన్నా సారథ్యంలో ఫార్చూన్ ల్యాండ్మార్క్ హోటల్ నుంచి ప్రత్యేకంగా సిబ్బందిని రప్పించారు. ప్రత్యేకంగా ఓ వంటగదిని కూాడా అక్కడే ఏర్పాటు చేశారు. ఇది తాత్కాలికంగా పనిచేస్తుంది. మల్టీ గ్రెయిన్తో తయారు చేసిన పుల్కాలను కూడా ట్రంప్ దంపతులకు అందించనున్నట్లు చెఫ్ సురేష్ ఖన్నా వెల్లడించారు.
మల్లఖంబా ప్రదర్శన..
ఆశ్రమాన్ని సందర్శించనున్న సందర్భంగా సబర్మతి గురుకుల్ విద్యార్థులు మల్లఖంబా ప్రదర్శనను నిర్వహించారు. 12 అడుగుల ఎత్తు ఉన్న చెక్క స్తంభంపై సబర్మతి గురుకుల్ విద్యార్థులు విన్యాసాలను నిర్వహించనున్నారు. దీనికోసం15 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. డొనాల్డ్ ట్రంప్-నరేంద్ర మోడీ సంయుక్తంగా చేపట్టనున్న రోడ్షో సందర్భంగా మల్లఖంబ ప్రదర్శన ఉంటుందని అహ్మదాబాద్ అధికారులు వెల్లడించారు.
భద్రత గుప్పిట్లో సబర్మతి ఆశ్రమం..
ఇదిలావుండగా..డొనాల్డ్ ట్రంప్, మెలానియా ట్రంప్ పర్యటనను పురస్కరించుకుని అహ్మదాబాద్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. సబర్మతి ఆశ్రమం, మొతేరా స్టేడియం సహా ట్రంప్-మోడీ సంయుక్త రోడ్ షో నిర్వహించే మార్గంలో ఆంక్షలను విధించారు. వాహనాలను దారి మళ్లించారు. ఆదివారం మధ్యాహ్నమే ట్రయల్ రన్ నిర్వహించారు. రోడ్ షో కొనసాగే మార్గం పొడవునా జామర్లను అమర్చారు. భద్రతా ఏర్పాట్లను కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.