గుజరాత్ ఎన్నికల సిత్రాలు- డబుల్ హ్యాట్రిక్ ఎమ్మెల్యేకు టికెటివ్వని బీజేపీ-రెబెల్ గా పోటీ
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి అధికారం నిలబెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న బీజేపీకి రెబెల్స్ బాధ తప్పడం లేదు. ముఖ్యంగా పార్టీలో వరుసగా గెలుస్తూ వస్తున్న ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ముఖ్యమంత్రులకు సైతం గెలుపు గుర్రాలు కాదన్న సాకుతో బీజేపీ అధిష్టానం టికెట్లు నిరాకరించడం సమస్యగా మారుతోంది. వీరంతా ఇప్పుడు రెబెల్స్ గా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు.
గుజరాత్ లోని వఘోడియా నుంచి వరుసగా ఆరుసార్లు గెలిచిన స్ధానిక నేత మధుభాయ్ శ్రీవాస్తవకు ఈసారి బీజేపీ టికెట్ ఇవ్వలేదు. దీంతో మధుభాయ్ కే టికెట్ ఇవ్వకపోవడమేంటన్న చర్చ జరుగుతోంది. అదే సమయంలో తనకు బీజేపీ టికెట్ రాలేదని తెలియడంతో మధుభాయ్ రెబెల్ గా బరిలోగి దిగేందుకు సిద్ధమయ్యారు. స్ధానికంగా ఆర్ధికంగా బలవంతుడైన మధుభాయ్ 2002 గోద్రా అల్లర్లతో తెరపైకి వచ్చారు. అప్పటికే స్వతంత్ర ఎమ్మెల్యేగా ఉన్న ఆయన్ను 2005లో మోడీ-అమిత్ షా స్వయంగా ఆహ్వానించారు. దీంతో బీజేపీలో చేరిన మధుభాయ్ కు అప్పటి నుంచి వరుసగా టికెట్ ఇస్తూ వచ్చారు. ఆయన కూడా గెలుస్తూ వచ్చారు.
ఈసారి మాత్రం తనకు టికెట్ దక్కకపోవడంపై అసంతృప్తిగా ఉన్న మధుభాయ్.. బీజేపీలో ఏం జరుగుతుందో చెప్పేశారు. సీఎం భూపేంద్ర పటేల్ కు టికెట్లు కేటాయించే శక్తి లేదని, అంతా ఢిల్లీలో కూర్చున్నవారే నిర్ణయిస్తున్నారని మధుభాయ్ చెప్పుకొచ్చారు. అలాగే 2005లో తన శక్తిని గ్రహించి మోడీ-అమిత్ షా పిలిస్తేనే బీజేపీలోకి వచ్చానని చేదు నిజం కూడా చెప్పేశారు. అంతే కాదు మరోసారి స్వతంత్ర అభ్యర్దిగా బరిలోకి దిగి సత్తా చాటుకుంటానని మధుభాయ్ చెప్తున్నారు.