మందగించిన కరోనా రెట్టింపు సమయం, రికార్డు స్థాయిలో పెరిగిన పరీక్షల సామర్థ్యం
న్యూఢిల్లీ: దేశంలో ఇప్పటి వరకు 78,003 కరోనా కేసులు నమోదవ్వగా, 2549 మంది మరణించారని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. అయితే, మూడు రోజులుగా కరోనా కేరసులు రెట్టింపయ్యే సమయం 13.9 రోజులకు తగ్గిందని చెప్పారు. ఇది ఊరటనిచ్చే అంశమని తెలిపారు.
కాగా, గత 24 గంటల్లో 14 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కరోనా కేసులు నమోదు కాలేదని మంత్రి చెప్పారు. ఇందులో గుజరాత్, తెలంగాణ, జార్ఖండ్, ఛండీగఢ్, ఛత్తీస్ గఢ్, అండమాన్ నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, దాద్రానగర్ హవేలి, గోవా, మణిపూర్, మేఘాలయ, మిజోరాం,పుదుచ్చేరి, డామన్ దీప్, సిక్కిం, నాగాలాండ్, లక్షద్వీప్ ఉన్నాయని పేర్కొన్నారు.
గత మూడు రోజులుగా కరోనా కేసుల రెట్టింపు సమయం 13.9 రోజులకు తగ్గింది. గత 14 రోజులుగా ఇది 11.1గా ఉందని మంత్రి తెలిపారు. పరీక్షల సామర్థ్యం పెంపుపై మాట్లాడుతూ.. రోజుకు 10వేల పరీక్షలు చేసే సామర్థ్యానికి మనం చేరుకున్నామన్నారు. దాదాపు 20 లక్షల పరీక్షలు పూర్తి చేశామన్నారు.
Recommended Video
జాతీయ వ్యాధి నియంత్రణ సంస్థ(ఎన్సీడీసీ)లో కోబాస్ 6800 పరీక్షా యంత్రాన్ని ఆయన ఆవిష్కరించారు. కోబాస్ 6800 యంత్రం పూర్తిగా ఆటోమేటిక్, అత్యంత నాణ్యంగా పీసీఆర్ టెస్టులు నిర్వహిస్తుందన్నారు. 24 గంటల వ్యవధిలో 1200 నమూనాలు పరీక్షిస్తుందని తెలిపారు. ఆపరేషన్ కూడా సులభమని, సిబ్బంది దూరంగా ఉంటూనే పరీక్షలు నిర్వహించవచ్చని మంత్రి హర్షవర్ధన్ తెలిపారు.