పూరీ జగన్నాథ ఆలయంలో ఇకనుంచి డ్రెస్ కోడ్ అమలు...
దేశంలోని కొన్ని ప్రముఖ దేవాలయాల్లో ప్రవేశించాలంటే డ్రెస్ కోడ్ తప్పనిసరి చేశాయి. ఇప్పడు ఆ జాబితాలో ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయం కూడా చేరింది. ఇప్పటికే తిరుపతి వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలకు వెళ్లేటప్పుడు షార్ట్ రిప్ట్ జీన్స్, స్కర్ట్స్ వంటివి ధరించడానికి వీల్లేదు. ఇప్పడు అదే పద్ధతిని పూరీ జగన్నాథ ఆలయానికి కూడా వర్తిస్తుంది.
ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయంలో జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవతల తోబుట్టువులు కొలువై ఉన్నారు. ఈ ఆలయంలో సోమవారం నుంచి కొత్తగా డ్రెస్ కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ ఆలయంలోకి ప్రవేశించే ముందు హాఫ్ఫ్యాంట్, షార్ట్స్, రిప్ట్ జీన్స్, స్కర్ట్స్, స్లీవ్లెస్ డ్రస్లు వంటివి ధరించకూడదనే నిబంధనలు పెట్టింది. అలాంటి డ్రెస్సులు ధరించినవారికి ఆలయం లోపలకి ప్రవేశం ఉండదని ఆలయ అధికారులు వివరించారు.

ఆలయం లోపలకి ప్రవేశించే భక్తులు మర్యాదకరమైన, సంప్రదాయకరమైన దుస్తులను మాత్రమే ధరించాలని ఆలయ అధికారులు కోరారు. కొత్త డ్రెస్ కోడ్ అమలు తర్వాత నుంచి పురుషులు ధోతీలు ధరించి ఆలయాల్లోకి ప్రవేశిస్తున్నారు. ఇక, మహిళలయితే ఎక్కువగా చీరలు, సల్వార్ కమీజ్లలో కనిపించడం మొదలుపెట్టారు. కొత్తగా పెట్టిన డ్రస్ కోడ్పై భక్తులకు అవగాహన కల్పించాలని జగన్నాథ ఆలయ పరిపాలన విభాగం హోటల్ యాజమానులను కోరడం జరిగింది.
న్యూ ఇయర్ రోజే 3.5 లక్షల మంది భక్తుల సందర్శన..
డ్రెస్ కోడ్ అమలుతోపాటు ఆలయంలో మరికొన్ని విషయాలపై అధికారులు నిఘాపెట్టారు. ఆలయం లోపల పాన్, గుట్కా వంటి నమలడంపై నిషేధాన్ని విధించారు. ఇంకా ఆలయం లోపల ప్లాస్టిక్ సంచుల వాడకాన్ని కూడా నిషేదించడం జరిగింది. కొత్త సంవత్సరం సందర్భంగా ఆలయానికి వచ్చే యాత్రికుల రద్దీని నివారించేందుకు తెల్లవారుజామున 1.40 నుంచే ఆలయ తలుపులను తెరిచి ఉంచినట్లు అధికారులు పేర్కొన్నారు.

న్యూఇయర్ రోజు సాయంత్రం ఐదు గంటల వరకు మొత్తం 3.5 లక్షల మంది భక్తులు ఆలయాన్ని సందర్శించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఆలయాన్ని సందర్శించే భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. భక్తులకు అవసరమయ్యే అన్నిరకాల సౌకర్యాలను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ముఖ్యంగా తాగునీరు, మరుగుదొడ్లు వంటి సౌకర్యాలను అందుబాటులో ఉంచారు. ఇంకా ఇక్కడ సీసీటీవి కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications