ఉన్మాదులుగా మారుతున్న మందుబాబులు .. మద్యం కోసం కత్తులతో దాడి.. ఒకరు మృతి
దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రబలుతున్న నేపధ్యంలో వ్యాప్తిని అరికట్టటానికి చేసిన లాక్ డౌన్ తో ప్రజల బాధలు చెప్పనలవి కావటం లేదు. ముఖ్యంగా మందుబాబుల బాధ అయితే వర్ణనాతీతంగా మారింది. మందు కోసం ఉన్మాదుల్లా మారుతున్నారు. పిచ్చివారిగా ప్రవర్తిస్తున్నారు. మద్యం దొరకని అసహనం, కోపం వెరసి కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే మరికొందరు దాడులకు, దోపిడీలకు దిగుతున్నారు. తాజాగా చెన్నై లో మందు కోసం వీరంగం వేసిన మందుబాబులు కొందరు ఏకంగా కత్తులతో దాడి చేసి ఒక వ్యక్తిని నరికి చంపిన ఘటన అందరినీ భయాందోళనకు గురి చేస్తుంది .
ఇక అసలు విషయానికి వస్తే చెన్నైలోని తిరువారూరులో మద్యానికి బానిసైన కొంత మంది యువకులు మద్యం కోసం మర్డర్ చేశారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు . మద్యం కోసం కొందరు ఆకతాయిలు వీధుల్లోకి వచ్చారు. లాక్డౌన్ నిబంధనల్ని లెక్క చేయకుండా ఎక్కడైనా మద్యం దొరుకుతుందేమోనని ఆరా తీయడం మొదలు పెట్టిన క్రమంలోనే వీరా అనే వ్యక్తిని వారు మద్యం కోసం అడిగారు . అయితే లాక్డౌన్ అమలవుతుంటే వీధుల్లో తిరుగుతారేమిటంటూ వాళ్ళపై ఆగ్రహం వ్యక్తం చేశాడు వీరా . పోలీసులు వస్తే అందరికీ ఇబ్బందవుతుందంటూ వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా వారికి చెప్పాడు .
దీంతో వీరా మాటలతో వారిలో అసహనం కట్టలు తెంచుకుంది . అసలే మద్యం దొరక్క లిక్కర్ కోసం పిచ్చి వాళ్ళలా తిరుగుతుంటే , నీ వార్నింగులు ఏమిటంటూ అతనితో గొడవపడ్డారు. అంతేకాదు తమ దగ్గర ఉన్న కత్తులతో వీరాపై దాడి చేసి, నరికి చంపారు ఆ యువకులు. దీంతో లాక్ డౌన్ ఉంది బయట తిరగకండి అన్న పాపానికి వీరా అనవసరంగా బలైపోయాడు. ఇక నడి రోడ్డుపై యువకులు వీరంగం వేస్తున్న దృశ్యాలు అక్కడికి సమీపంలో గల సీసీ టీవీ కెమెరాలో రికార్డయ్యాయి. దీంతో ఆరుగురు యువకుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక లాక్ డౌన్ మరింత పొడిగిస్తున్న వార్తల నేపధ్యంలో ఇలాంటి ఘటనలు బాగా పెరిగే ప్రమాదం ఉంది .