'మోడీకే ప్రాణభయముంటే.. దేశం పరిస్థితేంటి?'
సాక్షాత్తు దేశ ప్రధానికే ప్రాణభయం ఉందంటే.. ఇక దేశం పరిస్థితేంటని ఎంపీ నరేష్ అగర్వాల్ ప్రశ్నించారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం దేశంలో ఎమర్జెన్సీని తలపిస్తోందని విమర్శించారు.
న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దుపై చర్చతో పార్లమెంట్ ఉభయసభలు దద్దరిల్లుతున్నాయి. రాజ్యసభకు ప్రధాని మోడీ వచ్చి స్పందించాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్న నేపథ్యంలో.. రాజ్యసభలో అడుగుపెట్టారు మోడీ. ఈ సందర్బంగా సమాజ్ వాదీ పార్టీ ఎంపీ నరేశ్ అగర్వాల్ మాట్లాడుతూ మోడీ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.
పెద్ద నోట్ల రద్దు నిర్ణయం కారణంగా.. తనను కొంతమంది చంపడానికి ప్రయత్నించవచ్చునని, తనకు ప్రాణభయం ఉందని మోడీ పేర్కొనడాన్ని నరేశ్ అగర్వాల్ దుయ్యబట్టారు. సాక్షాత్తు దేశ ప్రధానికే ప్రాణభయం ఉందంటే.. ఇక దేశం పరిస్థితేంటని ప్రశ్నించారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం దేశంలో ఎమర్జెన్సీని తలపిస్తోందని విమర్శించారు.

నోట్ల రద్దు వల్ల సామాన్యులే అష్టకష్టాలు పడుతున్నారని, కోటీశ్వరులెవరైనా క్యూ లైన్లలో నిలబడుతున్న పరిస్థితి కనిపిస్తుందా అని నిలదీశారు. ఇక ప్రజలంతా మోడీ నిర్ణయానికి అనుకూలంగా ఉన్నారన్న బీజేపీ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఎమర్జెన్సీ విధించిన సమయంలోను ప్రజలంతా కాంగ్రెస్ కు అనుకూలంగానే ఉన్నారని నివేదికలు అందాయని, తీరా ఆ మరుసటి ఎన్నికల్లో ఏం జరిగిందో అందరికీ తెలిసిందేనని అన్నారు.
కేవలం యూపీ ఎన్నికల్లో లబ్డి పొందేందుకే మోడీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని తీసుకున్నారని ఆరోపించిన అగర్వాల్.. ఇకమీదట నోట్ల రద్దు నిర్ణయం అంటూ జరిగితే పార్లమెంట్ ఉభయ సభల అనుమతితోనే జరగాలని డిమాండ్ చేశారు. విజయ్ మాల్యా లాంటి బడాబాబులకు రూ.7వేల కోట్ల రుణాలను ఎలా మాఫీ చేస్తారని ప్రశ్నించారు. కనీసం ఆర్థికమంత్రి జైట్లీని కూడా విశ్వాసంలోకి తీసుకోకుండా మోడీ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications