మోదీకి షాకిచ్చిన దీదీ -బీజేపీ లూటీ చేస్తోంది -ప్రధాని సభ వేళ ఎల్పీజీ ధరలపై బెంగాల్ సీఎం నిరసన
అసలే అసెంబ్లీ ఎన్నికల వేడి కొనసాగుతోన్న పశ్చిమ బెంగాల్ లో ఆదివారం ఉష్ణోగ్రతలు తారాస్థాయికి చేరాయి. ఓవైపు ప్రధాని నరేంద్ర మోదీ కోల్ కతాలో భారీ బహిరంగ సభ నిర్వహించగా.. దానికి పోటీ అన్నట్లుగా ధరల మంటలపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిరసన ర్యాలీ చేపట్టారు..
పెరిగిన సిలిండర్ ధరలను వ్యతిరేకిస్తూ బెంగాల్ సీఎం ఆధ్వర్యంలో సిలుగురిలో ఆదివారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళలతో కలిసి సీఎం మమత పాదయాత్ర నిర్వహిస్తూ నిరసనను వ్యక్తం చేశారు. అధికార బీజేపీ ప్రజలను దోచుకుంటోందని దీదీమండిపడ్డారు. పెరిగిన ధరలు మోదీ దృష్టికి తీసుకురావడానికే తాము ఈ ర్యాలీని నిర్వహించామని ఆమె పేర్కొన్నారు.

పెట్రో, గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, దీనికి మోదీ సమాధానం చెప్పి తీరాలని మమత డిమాండ్ చేశారు. మోదీ కేవలం మాటలు మాత్రమే చెబుతారని, జనాన్ని మాత్రం దోచుకుంటూనే ఉన్నారని దీదీ ఎద్దేవా చేశారు. బెంగాల్లో మార్పు రావాలని మోదీ అంటున్నారని, నిజానికి పరివర్తన కేంద్రంలోనే వస్తుందని, మోదీ గద్దె దిగక తప్పదని మమత కౌంటరిచ్చారు.

బెంగాల్ ప్రజలను మమత మోసం చేశారని, మహిళలపైనా టీఎంసీ సర్కారు వేధింపులకు పాల్పడుతోందని కోల్ కతా ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. మోదీ మాటలు అబద్ధాలన్న మమత..

బెంగాల్లో మహిళలు అత్యంత సురక్షితంగా ఉన్నారని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే ఆడవాళ్ల పరిస్థితులు బాగోలేవని విమర్శించారు.












Click it and Unblock the Notifications