పన్నీరుకు షాక్: సీఎంగా శశికళ అనుచరుడు పళని? ఇద్దరికీ గవర్నర్ అపాయింట్మెంట్
తమిళనాడులో ముఖ్యమంత్రి పీఠం పైన జరుగుతున్న సస్పెన్స్కు బుధవారం నాడు తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీఎం పీఠం విషయంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంకు షాక్ తగలేలా కనిపిస్తోంది.
చెన్నై: తమిళనాడులో ముఖ్యమంత్రి పీఠం పైన జరుగుతున్న సస్పెన్స్కు బుధవారం నాడు తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీఎం పీఠం విషయంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంకు షాక్ తగలేలా కనిపిస్తోంది.
అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ ఎంపిక చేసిన పళని స్వామికి ముఖ్యమంత్రి పీఠం దక్కేలా కనిపిస్తోంది. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే.. ఇంచార్జ్ గవర్నర్ విద్యాసాగర రావు ఆయనను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించేలా కనిపిస్తోందంటున్నారు.
మెజార్టీ ఎమ్మెల్యేలు పళనిస్వామి వైపు ఉన్నట్లుగా కనిపిస్తోంది. తనకు మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెబుతూ ఆయన అందుకు సంబంధించిన పత్రాలను గవర్నర్ విద్యాసాగర రావుకు మంగళవారం నాడు సమర్పించారు. మరోసారి ఆయన గవర్నర్కు ఇందుకు సంబంధించిన పత్రాలను ఇవ్వనున్నారని తెలుస్తోంది.
పన్నీరు సెల్వం వైపు ఉన్న ఎమ్మెల్యేలు పది లోపే అని చెబుతున్నారు. మిగతా ఎమ్మెల్యేలు ఎవరు కూడా చిన్నమ్మ మాట జవదాటకుండా.. పళనిస్వామికి అండగా ఉన్నారని చెబుతున్నారు.
సుప్రీం కోర్టు తనకు జైలు శిక్ష విధించిన నేపథ్యంలో తన స్థానంలో సీఎం రేసులోకి పళనిస్వామిని చిన్నమ్మ తీసుకు వచ్చారు. ఆయనకు మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు కనిపిస్తోంది.
న్యాయ నిపుణుల సలహా
గవర్నర్ విద్యాసాగర రావు ముగ్గురు న్యాయ నిపుణులను సలహా అడిగారు. దీనిపై ఇద్దరు ఒక రకంగా, మరొకరు ఇంకో రకంగా సూచన చేశారని తెలుస్తోంది.
బల నిరూపణ కోసం పన్నీరుకు, పళనిస్వామిలకు అవకాశమివ్వాలని ఇరువురు న్యాయ నిపుణులు సూచించగా, ఒకరు మాత్రం పళని స్వామిని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానించి, ఆ తర్వాత బల నిరూపణ చేసుకోవాలని సూచించాలని చెప్పారని తెలుస్తోంది.
ఇరువురికి అపాయింటుమెంట్ ఇచ్చిన గవర్నర్
గవర్నర్ విద్యాసాగర రావు బుధవారం రాత్రి పళని స్వామికి, ఆపద్ధర్మ సీఎం పన్నీరు సెల్వంలకు అపాయింటుమెంట్ ఇచ్చారు. పళనిస్వామితో కలిసి ఏడుగురు మంత్రులు గవర్నర్తో భేటీ కానున్నారు. ఆ తర్వాత పన్నీరు సెల్వం గవర్నర్ను కలవనున్నారు. బల నిరూపణకు పిలవాలని ఇరువురు కూడా కోరే అవకాశముంది.