కర్నాటకలో ముందస్తు ఎన్నికలకు బీజేపీ ? హిజాబ్-హలాల్ వివాదాల్ని సొమ్ము చేసుకునే వ్యూహం
కర్నాటకలో మొదలైన హిజాబ్, హలాల్ వివాదాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. కర్నాటకలో మత విభజన చేయడం వల్ల ఐటీ రంగం దెబ్బతింటోందని బయోకాన్ సీఎండీ కిరణ్ మజుందార్ షా హెచ్చరించారు. హిజాబ్ వివాదం నేపథ్యంలో రాష్టంలో మతపరమైన విభజన కనిపిస్తోంది. ఈ పరిణామాల్ని సొమ్ము చేసుకునేందుకు బీజేపీ తెరవెనుక ప్రయత్నాలు మొదలుపెట్టేసింది.
కర్ణాటకలో ఎన్నికలు ఈ ఏడాది నవంబర్ 27న ప్రకటించనున్నట్లు కాంగ్రెస్కు సమాచారం ఉందని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఈ వారంలో విలేకరుల సమావేశంలో తెలిపారు. గుజరాత్ ఎన్నికలతో పాటే కర్ణాటక ఎన్నికలను కలిపి నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది నవంబర్ 27న రాష్ట్ర ఎన్నికలను ప్రకటిస్తామని ఆయన చేసిన ప్రకటన ఆధారంగా ప్రశ్నించినప్పుడు, "మీడియాకు మూలాలు ఉన్నట్లే, మాకు కూడా మూలాలు ఉన్నాయి" అని శివకుమార్ అన్నారు.
దీంతో బీజేపీ తెరవెనుక వ్యూహాలపై చర్చ మొదలైంది. రాష్ట్రంలో మొదలైన హిజాబ్, హలాల్ వివాదాల కారణంగా ప్రజల్లో స్పష్టమైన మతపరమైన విభజన కనిపిస్తోందని బీజేపీ అంచనా వేసుకుంటోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికలను ముందస్తుగా నిర్వహించడం ద్వారా ఈ వేడిని సొమ్ము చేసుకోవాలనే ఉద్దేశంలో కాషాయ నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆలస్యమైతే వివాదాలు చల్లారిపోతాయని, అప్పుడు ఎన్నికలను సాధారణ పరిస్ధితుల్లో ఎదుర్కోవాల్సి వస్తుందన్న భావనలో బీజేపీ నేతలు కనిపిస్తున్నారు.
వాస్తవానికి ఈ నెల ప్రారంభంలో నాలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయాన్ని నమోదు చేసినప్పటి నుంచి, ఇటీవలి విజయాల ఊపును ఉపయోగించుకునేందుకు కర్ణాటకలో ముందస్తు ఎన్నికలకు బీజేపీ హైకమాండ్ మొగ్గు చూపుతున్నట్లు రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అనేక స్థాయిల్లో అవినీతి ఆరోపణలతో కొట్టుమిట్టాడుతున్న కర్ణాటకలోని బీజేపీ.. ముందస్తు ఎన్నికలకు వెళ్లడం ద్వారా అవినీతి మచ్చను, అధికార వ్యతిరేక ఒత్తిళ్లను అధిగమించాలని చూస్తోందని బీజేపీ ప్రభుత్వంలోని సీనియర్ మంత్రుల సన్నిహితులు సూచించారు. అయితే ముందస్తు ఎన్నికలకు వెళ్లడంపై పార్టీ ఇంకా నిర్ణయం తీసుకోలేదని, అయితే ఎన్నికలకు ముందు కొత్త ఆరోపణలు రాకుండా చూసుకోవాలని, ఇది పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాలకు హానికరం అని బిజెపి వర్గాలు పేర్కొన్నాయి. .